
Vaibhav Sooryavanshi Dropped: ఇంగ్లాండ్తో సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్లో 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడింది. అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకున్నారు. కేవలం వారం క్రితమే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి, అత్యంత పిన్న వయసులో భారత్ తరపున ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సూర్యవంశీ.. ఇప్పుడు కనీసం రాబోయే రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఐదో టీ20 మ్యాచ్ టాస్ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై అయ్యర్ ఒక పెద్ద బాంబ్ పేల్చాడు. “ఈ మ్యాచ్లో మేము రెండు మార్పులు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్, సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చారు. భవిష్యత్తులో జట్టుకు ఏది మంచిదో, ఎలాంటి కాంబినేషన్లు సరిపోతాయో ప్రయోగించి చూడాల్సిన సమయం ఇది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని అయ్యర్ స్పష్టం చేశాడు. దీన్ని బట్టి చూస్తే, 2028 టీ20 వరల్డ్ కప్ కోసం మేనేజ్మెంట్ సిద్ధం చేస్తున్న రోడ్మ్యాప్లో ప్రస్తుతానికి సూర్యవంశీకి చోటు లేదని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ.. అత్యధిక పరుగులు సాధించి ప్రతిష్టాత్మకమైన ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఐర్లాండ్ పర్యటనలో బెంచ్కే పరిమితమైన ఈ 15 ఏళ్ల వండర్ కిడ్.. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా మాంచెస్టర్లో అరంగేట్రం చేశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని అతను తట్టుకోలేకపోయాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లో కేవలం 14 సగటుతో 42 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ వైఫల్యమే అతని ఉద్వాసనకు కారణమైంది.
అహ్మదాబాద్లో జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ చారిత్రాత్మక టైటిల్ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ స్థానంలో బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్ను కొత్త టీ20 కెప్టెన్గా ప్రకటించింది. 2028 వరల్డ్ కప్ వరకు అయ్యర్ జట్టును నడిపించనున్నాడు. అలాగే సీనియర్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించింది. భవిష్యత్తు కాంబినేషన్ల వేటలో భాగంగానే సూర్యవంశీని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..