
Vaibhav Sooryavanshi : జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత యువ క్రికెట్ జట్టు తొలి టీ20 మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్, జింబాబ్వేను 125/7 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 126 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఊదేసింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది మొదటి విజయం.
18 బంతుల్లో ఫిఫ్టీ… సచిన్ సంచలన రికార్డు బద్ధలు
ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు 15 ఏళ్ల భారత యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ (50) పూర్తి చేసుకున్నాడు. కేవలం 15 సంవత్సరాల 118 రోజుల వయస్సులో హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్, పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయస్సులో ఫిఫ్టీ కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 213 రోజులు) పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు.
మయాంక్ యాదవ్ పదునైన బౌలింగ్
అంతకుముందు భారత బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన స్పీడ్స్టర్ మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ వేసిన మొదటి బంతికే వికెట్ పడగొట్టి సంచలనం సృష్టించాడు. మయాంక్ తన 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అతనికి తోడుగా ప్రిన్స్ యాదవ్ 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (35), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజేతగా నిలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..