
Vaibhav Sooryavanshi : శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా A జట్టు ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి ముఖ్య కారకుడు 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా A జట్టు వైభవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఓవర్లలో 378 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక A జట్టు 66 పరుగుల దూరంలోనే నిలిచిపోయి ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, అవార్డు తీసుకునే సమయంలో తనపై వస్తున్న ఒక ప్రచారాన్ని అతను తీవ్రంగా ఖండించాడు.
లైవ్లోనే రూమర్లను తిప్పికొట్టిన వైభవ్
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటర్ వైభవ్ సూర్యవంశీని ఒక ప్రశ్న అడిగాడు. “నువ్వు టీ20 క్రికెట్లో చాలా బాగా రాణిస్తున్నావు కానీ.. వన్డే క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) ఎక్కువగా ఆడలేదు కదా, మరి ఈ టోర్నమెంట్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వినగానే వైభవ్ దానికి ఏమాత్రం అంగీకరించలేదు. తాను వన్డే క్రికెట్ ఎక్కువగా ఆడలేదనే మాటను పూర్తిగా తప్పుబట్టాడు. “నేను నా కెరీర్లో వన్డే ఫార్మాట్ కూడా చాలానే ఆడాను. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు.. జనాలు అవన్నీ అబద్ధపు రూమర్లుగా ప్రచారం చేస్తున్నారు” అని లైవ్లోనే స్పష్టం చేశాడు.
దంబుల్లా పిచ్పై నయా వరల్డ్ రికార్డ్
ఈ ట్రై సిరీస్లో అంతకుముందు జరిగిన 4 మ్యాచ్లలో వైభవ్ కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు, కొట్టింది కేవలం 3 సిక్సర్లు మాత్రమే. కానీ ఫైనల్ అనే సరికి తన బ్యాటింగ్ గేర్ను పూర్తిగా మార్చేశాడు. శ్రీలంక A బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. ఇందులో 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ సమయంలో వైభవ్ కేవలం 11 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
The SMILE in the end 😅
Playing with freedom. Speaking with confidence. Smiling through it all. 😊
Vaibhav Sooryavanshi, your 𝘗𝘓𝘈𝘠𝘌𝘙 𝘖𝘍 𝘛𝘏𝘌 𝘔𝘈𝘛𝘊𝘏!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/Cg8BZzVQ9Q
— Sony Sports Network (@SonySportsNetwk) June 21, 2026
ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ను చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఫిదా అయ్యారు. “సక్సెస్ మంత్రం అంటే ఇదే.. ఒత్తిడి ఉన్న సమయంలో కూడా ఎంతో ప్రశాంతంగా ఎలా ఆడాలో ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని చూసి నేర్చుకోవాలి” అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు. వైభవ్ ఈ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్లు ఆడి 211 పరుగులు చేశాడు. అందులో మొత్తం 11 సిక్సర్లు ఉన్నాయి. దంబుల్లా పిచ్ కండిషన్స్ చాలా భిన్నంగా ఉన్నాయని, ఇక్కడ ఆడి రికార్డులు సృష్టించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వైభవ్ సంతోషం వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి