
ఇటీవల కాలంలో తరచూ ఎంఎస్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక ఈ సీజన్లో ఆదివారం సీఎస్కేకి చివరి మ్యాచ్ కావడంతో ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఉదయం నుంచి తెగ ప్రచారం జరిగింది. అయితే గుజరాత్లో మ్యాచ్ తర్వాత ఈ రిటైర్మెంట్ ప్రచారం పై స్వయంగా ఎంఎస్ ధోనినే స్పందించారు. తన భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా టైం ఉందని..ఇప్పుడే తొందరేమి లేదని చెప్పారు. తాను ఇప్పుడే రిటైర్మెంట్ ఇస్తానని చెప్పట్లేదని.. అలాగని వచ్చే ఏడాది ఆడుతానని కూడా చెప్పట్లేదని ధోనీ తెలిపారు.
రిటైర్మెంట్పై ధోని మాట్లాడుతూ.. నా భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల టైం ఉందని.. ఇప్పుడే తొందరేం లేదని తెలిపారు. నేను ఆడాలంటే ముఖ్యంగా నా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలని ఆయన అన్నారు. ఒకవేళ ఆటగాళ్లు తమ ప్రదర్శన బాగోలేదని రిటైర్ అవ్వడం స్టార్ట్ చేస్తే, కొందరు 22 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తుందన్నారు. నాకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రస్తుతం నేను ఇంటికి వెళ్లి.. అక్కడ నా బైక్స్తో రైడ్స్ ఎంజాయ్ చేస్తానని ఆయన అన్నారు. ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే నేను పూర్తిగా ఆపేస్తున్నానని చెప్పడం లేదని.. అలాగని మళ్ళీ వస్తానని కూడా చెప్పట్లేదని ధోని చెప్పుకొచ్చారు.
ఇక ఐపీఎల్ 2025ని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన తన చివరి మ్యాచ్లో పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న గుజరాత్ను 83 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి గుజరాత్ ముందు 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక లక్షఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..