Asia Cup : నేడు ఆసియా కప్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. తేలనున్న నలుగురు స్టార్ల భవితవ్యం

ఎన్నో రోజులుగా జరుగుతున్న చర్చలు, ఊహాగానాలకు తెరపడనుంది. ఆసియా కప్ 2025 కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లే 15 మంది భారత క్రికెటర్ల జట్టును ఈరోజు ప్రకటిస్తారు. ముంబైలో బీసీసీఐ కార్యాలయంలో మధ్యాహ్నం ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా జట్టును ప్రకటిస్తారు.

Asia Cup : నేడు ఆసియా కప్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. తేలనున్న నలుగురు స్టార్ల భవితవ్యం
Squad Selection

Updated on: Aug 19, 2025 | 8:06 AM

Asia Cup : క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడనుంది. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మంగళవారం, ఆగస్టు 19న ముంబైలో ప్రకటించనున్నారు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మధ్యాహ్నం జరిగే ప్రెస్‌మీట్‌లో టీమిండియా స్క్వాడ్‌ను వెల్లడించనున్నారు. చాలామంది ఆటగాళ్ల పేర్లు దాదాపు ఖరారైనప్పటికీ నలుగురు స్టార్ ఆటగాళ్ల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌ ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. దీంతో జట్టు ఎంపిక కొంచెం క్లిష్టంగా మారింది. గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో ఆడుతున్న జట్టు వేరు, టెస్టులు, వన్డేలు ఆడుతున్న జట్టు వేరు. దీంతో టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కొందరిని టీ20 జట్టులోకి తీసుకుంటారా లేదా అనే చర్చ జరుగుతోంది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అజిత్ అగార్కర్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొంటారు. కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు అగార్కర్, సూర్యకుమార్ మీడియా ముందుకు వచ్చి జట్టును ప్రకటిస్తారు. ఈ సందర్భంగా నలుగురు ఆటగాళ్ల గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ఆ నలుగురిలో ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరూ టీ20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. కానీ, గత ఏడాది కాలంగా టెస్ట్ క్రికెట్‌పై దృష్టి సారించడంతో టీ20 జట్టుకు దూరమయ్యారు. అయితే, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనే చర్చ జరుగుతోంది. అయితే, ప్రస్తుతం అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ ఓపెనింగ్ జోడీ బాగా రాణిస్తున్నందున, వారికి మార్పులు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి, మూడో ఓపెనర్‌గా, లేదా బ్యాకప్ ఓపెనర్‌గా ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

గిల్, జైస్వాల్ కాకుండా, మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్ భవిష్యత్తుపై కూడా ఉత్కంఠ నెలకొంది. శ్రేయాస్ అయ్యర్ జట్టు నుంచి బయటపడిన తర్వాత దేశీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కీలక పాత్ర పోషించాడు. కానీ, మిడిల్ ఆర్డర్‌లో అతనికి చోటు దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ ప్రదర్శన ఇటీవల కాస్త నెమ్మదిగా ఉంది. గతేడాది కాలంలో టీమిండియాలో ఐపీఎల్‌లో అతనికి ఎక్కువ అవకాశాలు దక్కలేదు. దీంతో ఈ నలుగురు ఆటగాళ్ల భవితవ్యంపై అగార్కర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..