భారత క్రికెట్ జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది.. ఈ సందర్భంగా టీ20 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. టీ20 వరల్డ్ కప్తో బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న టీమిండియాకు ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం లభించింది. అనంతరం ఐటీసీ మౌర్యా హోటల్ కు చేరుకున్న క్రికెటర్లు కాసేపు రెస్ట్ అనంతరం.. లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి చేరుకున్న టీమిండియా ప్లేయర్స్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. టీ20 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టును మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్.. కార్యక్రమంలో భాగంగా మోదీ.. క్రికెటర్లతో ప్రత్యేకంగా సంభాషించారు.. టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రదర్శన.. ఫైనల్ మ్యాచ్ తదితర అంశాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ జట్టు సభ్యులతో కలిసి ఫొటో దిగారు.
వరల్డ్ కప్ గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన ఆటగాళ్లందరికీ.. అభిమానులు ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు సందడి చేస్తూ కనిపించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్, సూర్యకుమార్ యాదవ్, సిరాజ్ ఇలా ప్రతి ఒక్కరూ ట్రోఫీతో ఫుల్ జోష్లో కనిపించారు. హోటల్లో కేక్ కటింట్ సెలబ్రేషన్ కూడా గ్రాండ్గా జరిగింది..
ప్రధానితో భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి టీమిండియా ఆటగాళ్లు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో జరగనుంది… ముంబైలో నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ క్రికెటర్లను సన్మానించనుంది. ముంబైలో సాయంత్రం జరగబోయే పరేడ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
టీమిండియా దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007 ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ ఇప్పుడు మళ్లీ కప్ సాధించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. జూన్ 29 జరిగిన ఫైనాల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా నిలిచింది. కప్ గెలిచిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉన్నా బెరిల్ తుపాను కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయిన భారత జట్టు ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఇండియా చేరుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..