Ranji Trophy 2024: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 62వ సెంచరీ.. టీమిండియా నయావాల్ రికార్డుల మోత.. అయినా, హ్యాండిచ్చిన సెలెక్టర్లు

|

Feb 10, 2024 | 1:55 PM

Cheteshwar Pujara: ప్రస్తుతం టీమిండియాకు దూరమైన చెతేశ్వర్ పుజారా రంజీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అందుకే ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారని ఊహించినా.. అదీ జరగలేదు. ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి 3 మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. కానీ, కోహ్లీ ప్లేస్‌లో పుజరాను ఎంపిక చేస్తారని భావించినా.. మరోసారి ఈ సీనియర్‌కు ఎదురుచూపులు తప్పలేదు.

Ranji Trophy 2024: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 62వ సెంచరీ.. టీమిండియా నయావాల్ రికార్డుల మోత.. అయినా, హ్యాండిచ్చిన సెలెక్టర్లు
Cheteshwar Pujara
Follow us on

Cheteshwar Pujara 62nd Hundred: జైపూర్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెతేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు కెవిన్ (0), హార్విక్ దేశాయ్ (21) తొందరగానే ఔటవగా, ఆ తర్వాత విశ్వరాజ్ జడేజా 22 పరుగులు చేసి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ దశలో బరిలోకి దిగిన టీమిండియా నయా వాల్ ఛెతేశ్వర్ పుజారా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

ఆడితూచి బ్యాటింగ్‌ చేయడంతోపాటు జట్టును తొలి షాక్ నుంచి గట్టెక్కించిన పుజారా.. షెల్డన్ జాక్సన్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 230 బంతులు ఎదుర్కొన్న ఛెతేశ్వర్ పుజారా 9 ఫోర్లతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు.

విశేషమేమిటంటే.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో చతేశ్వర్ పుజారాకి ఇది 62వ సెంచరీ కావడం గమనార్హం. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయుల జాబితాలో పుజారా 3వ స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్స్ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సచిన్, సునీల్ గవాస్కర్ 81 సెంచరీలు చేశారు. 68 సెంచరీలు చేసిన ద్రవిడ్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో 62వ సెంచరీతో పుజారా 3వ స్థానంలో నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో చెతేశ్వర్ పుజారా (110) సెంచరీ, షెల్డన్ జాక్సన్ (78) అజేయ అర్ధ సెంచరీతో సౌరాష్ట్ర జట్టు 89.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది.

సెంచరీలతో దంచి కొడుతోన్న పట్టించుకోని బీసీసీఐ సెలక్టర్లు..

రంజీల్లో పుజరా వరుస సెంచరీలతో దంచి కొడుతోన్నా.. బీసీసీఐ సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీమిండియా 5 టెస్టుల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే రెండు టెస్టుల పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15 నుంచి 3వ టెస్ట్ మొదలుకానుంది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లకు విరాట్ అందుబాటులో లేడు. ఆయన స్థానంలో పుజారాను ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కానీ, తాజాగా భారత స్వ్కాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ.. మరోసారి ఈ సీనియర్ ప్లేయర్‌కు మొండిచేయినే చూపించింది.

చివరి మూడు టెస్టులకు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..