
Virat Kohli Food Habits: కఠోర శ్రమ, ప్రతిభ కారణంగానే విరాట్ కోహ్లీ నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్గా ఎదిగాడు. కెరీర్లో తీసుకున్న సరైన నిర్ణయాల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇటీవల, విరాట్ కోహ్లీ తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయాల గురించి మాట్లాడాడు. శాకాహారిగా మారడమే తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయమని చెప్పుకొచ్చాడు. దానివల్ల గత కొన్నేళ్లుగా ఆరోగ్యం పరంగానే కాదు, మానసికంగానూ బాగున్నట్లు ప్రకటించాడు.
‘మాంసాహారం తినడం వల్ల శరీరంలో ఇబ్బందిగా ఉండేదంటూ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నాన్ వెజ్ తినడం వల్ల నాకు రాత్రి సరిగా నిద్ర పట్టేది కాదు. అలాగే నా శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉందని టెస్టుల్లో తేలింది. ఆ కారణంగా నా ఆహారం వల్ల నా కడుపులో చాలా యాసిడ్ వచ్చింది. నేను క్యాల్షియం, మెగ్నీషియం అన్నీ తీసుకున్నా. కానీ, నాకు ఒక్క టాబ్లెట్ సరిపోలేదు. నా ఎముకలు కూడా బలహీనమయ్యాయంటూ’ షాక్ ఇచ్చాడు.
‘ఈ సమస్యల కారణంగా 2018లో ఇంగ్లండ్ పర్యటనలో మాంసాహారం మానేశానని విరాట్ కోహ్లీ తెలిపాడు. నాన్ వెజ్ తినడం కంటే వెజిటేరియన్గా ఉండటమే మంచిది. శాకాహారిగా ఉండడం వల్ల నాకు మంచి అనుభూతి కలుగుతుంది. నేను ఈ పనిని 2-3 సంవత్సరాల క్రితం చేసి ఉంటే, ఇంకా బాగుండేదంటూ’ తెలిపాడు.
‘ఈ నిర్ణయం అన్నింటినీ పూర్తిగా మార్చేసింది. ఈ నిర్ణయం వల్ల మంచి అనుభూతి చెందాను. బాగా ఆలోచించగలుగుతున్నాను. శరీరం తేలికగా అనిపిస్తుంది. మరింత సానుకూలంగా మారాను. నా ఈ నిర్ణయం నాకు అద్భుతమైన, ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఇచ్చిందంటూ’ ప్రకటించాడు. విరాట్ కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది యువకులు విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.
కాగా, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆసియాకప్ కోసం శ్రీలంకలో ఉన్నాడు. సూపర్ 4 చేరిన టీమిండియా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..