
Ravichandran Ashwin Comments on Indian Cricket Fan Culture: భారత క్రికెట్లో ఫ్యాన్ ఆర్మీల ప్రభావం పెరుగుతుందని రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. సోషల్ మీడియాలో ఆటగాళ్లపై వ్యక్తిగత అభిమానం పెంచుతూ టీమ్ ప్రయోజనాలను మర్చిపోవడం ప్రమాదకరమంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి అభిప్రాయాలు కొన్నిసార్లు వ్యక్తిగతంగా వినిపించినా ఆ తర్వాత సోషల్ మీడియాలో వేరే పేర్లతో కనిపిస్తున్నాయని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అశ్విన్ మాట్లాడుతూ, “ఇది ఒక వ్యాధిలా మారింది. ఫ్యాన్ ఆర్మీలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం చాలా ప్రమాదకరం. ఇది క్రికెట్కు మంచిది కాదు” అని వ్యాఖ్యానించాడు. అతను నేరుగా ఆటగాళ్లను తప్పుపట్టకపోయినా, ఈ విధమైన పీఆర్ కార్యకలాపాలు సోషల్ మీడియా యుద్ధాలకు దారితీస్తున్నాయని తెలిపాడు.
ప్రస్తుతం ప్రతి ఆటగాడు ఒక బ్రాండ్గా మారిపోయాడని అశ్విన్ అన్నాడు. తమ విలువ పెంచుకోవడానికి పీఆర్ చర్యలు చేయడం సర్వసాధారణమని చెప్పినా, ఇతర ఆటగాళ్లపై విమర్శలు చేయడం తాను ఎప్పటికీ అంగీకరించనని స్పష్టం చేశాడు. ఇలాంటి చర్యలు టీమ్ స్పిరిట్ను దెబ్బతీస్తాయని హెచ్చరించాడు.
అశ్విన్, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ప్రశంసించాడు. వ్యక్తిగత ఆటగాళ్ల కంటే టీమ్ను ముందుంచే వ్యక్తిగా గంభీర్ను కొనియాడాడు. “టీమ్ ముందుంటేనే విజయం సాధ్యం” అనే గంభీర్ సిద్ధాంతాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపాడు.
2024లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్, ప్రస్తుతం టీ20 లీగ్లలో ఆడాలని భావిస్తున్నాడు. అయితే గాయం కారణంగా కొన్ని టోర్నీలకు దూరమయ్యాడు. భవిష్యత్తులో ప్లేయర్-కోచ్గా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అశ్విన్ భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..