IND Vs SA: లాభం లేదు.! జింబాబ్వేతో మ్యాచ్‌కు ఆ ఇద్దరిని దింపుతున్నాం.. ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి అనంతరం టీమిండియాలో కీలక మార్పులు జరగనున్నాయని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డస్కెట్ హింట్ ఇచ్చారు. తదుపరి మ్యాచ్‌లో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల ప్రాతినిధ్యాన్ని కూడా నొక్కి చెప్పాడు డస్కెట్. అక్షర్ పటేల్ తిరిగి తుది జట్టులోకి వస్తాడని చెప్పారు.

IND Vs SA: లాభం లేదు.! జింబాబ్వేతో మ్యాచ్‌కు ఆ ఇద్దరిని దింపుతున్నాం.. ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే
Team India

Updated on: Feb 23, 2026 | 7:11 PM

దక్షిణాఫ్రికా చేతిలో ఇటీవల టీ20 సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదుర్కుంది. ఈ నేపధ్యంలో జట్టులో కీలక మార్పులు చేయనుందట టీమిండియా. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డస్కెట్ ఈ మార్పుల గురించి స్పష్టమైన హింట్స్ ఇచ్చారు. రాబోయే జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పూర్తయిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డస్కెట్ మాట్లాడుతూ.. డస్కెట్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సంజూ జట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ డక్ అవుట్లతో సహా వరుసగా నాలుగో మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్ శర్మను తప్పిస్తారా? లేదా చెత్త ఫామ్‌లో కొనసాగుతున్న తిలక్ వర్మపై వేటు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. డస్కెట్ వ్యాఖ్యలను చూస్తే అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం, డస్కెట్ లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడమే..

టాప్ ఆర్డర్‌లో ఉన్న ముగ్గురు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్లైన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ప్రతి మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ మ్యాచ్‌లో సల్మాన్ ఆగ, దక్షిణాఫ్రికా మార్కరమ్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీశారు. దీంతో భారత జట్టు తక్కువ స్కోర్లకే కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడికి గురైంది. ఇది టీమిండియా ప్రదర్శనను గణనీయంగా ప్రభావితం చేసింది. గత 18 నెలల్లో బాగా ఆడిన ఆటగాళ్లను కొనసాగించాలా లేక సంజును జట్టులోకి తీసుకోవాలా అన్నదే ప్రస్తుత చర్చనీయాంశం అని డస్కెట్ అన్నారు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలంటే టాప్ ఆర్డర్‌లో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అవసరమని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఒకవేళ అభిషేక్ శర్మను జట్టులో కొనసాగించాలనుకుంటే, తిలక్ వర్మపై వేటు పడే అవకాశం ఉంది. అప్పుడు అభిషేక్ శర్మతో సంజు ఓపెనింగ్ చేయించి, ఇషాన్‌ను వన్ డౌన్ స్థానంలో పంపించే ప్రణాళికను టీమిండియా మేనేజ్‌మెంట్ పరిశీలించవచ్చు. ఈ మార్పుల ద్వారా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని, ప్రత్యర్థి ఆఫ్ స్పిన్ ప్రయోగాలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇకపోతే, టీమిండియాలో మరో ముఖ్యమైన మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో అతని లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బౌలింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో.. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్‌ను నమ్ముకున్న టీమ్ మేనేజ్‌మెంట్ నిరాశ చెందింది. దీంతో సుందర్‌ను తప్పించి మళ్లీ అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ టీమిండియాను మరింత బలోపేతం చేసి, రాబోయే మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన కనబర్చడానికి దోహదపడతాయని అంచనా.

Follow Us