పెళ్లి పేరుతో మోసం.. రేప్ చేశాడంటూ షమీ తమ్ముడిపై యువతి ఫిర్యాదు..!

Mohammed Shami: భారత క్రికెట్ జట్టు (Team India) స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సోదరుడు, బెంగాల్ రంజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్నోలో కేసు నమోదైంది.

పెళ్లి పేరుతో మోసం.. రేప్ చేశాడంటూ షమీ తమ్ముడిపై యువతి ఫిర్యాదు..!
Mohammed Shami Brother Mohammed Kaif

Updated on: Sep 14, 2026 | 2:34 PM

టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోని ఆషియానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగాల్ (Bengal) రంజీ ట్రోఫీ (Ranji Trophy) జట్టులో ఆడుతున్న కైఫ్, గత ఆరేళ్లుగా పెళ్లి పేరుతో తనను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ విడాకులు తీసుకున్న మహిళ ఆరోపించారు. ఎయిర్‌లైన్స్ సంస్థలో కేబిన్ క్రూగా విధులు నిర్వహిస్తున్న తనతో బలవంతంగా ఉద్యోగం కూడా మాన్పించాడని బాధితురాలు పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) వేలం పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పి, ఆపై కుటుంబ సభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో వెల్లడించారు.

బాధితురాలి వివరాల ప్రకారం.. 2020లో జాతీయ రాజధాని ప్రాంతం (NCR) లో నివసిస్తున్న సమయంలో కైఫ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. విడాకులు పొంది తన బిడ్డతో జీవిస్తున్న విషయాన్ని అతనికి స్పష్టంగా చెప్పినప్పటికీ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2023 సెప్టెంబర్ 9న కోల్‌కతా పిలిపించి ఓ హోటల్‌లో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె వాపోయింది. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ దాటవేస్తూ వచ్చాడు.

ఐపీఎల్ (IPL) 2025 వేలం ముగిశాక పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పాడని బాధితురాలు ఆరోపించారు. తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో కైఫ్, ఆయన సోదరుడు హసీబ్ (Haseeb), ఇతర కుటుంబ సభ్యులు తనను బెదిరించినట్లు స్పష్టం చేశారు. ఎవరికీ ఏమీ చేయలేవంటూ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ ఉద్యోగం చేయడం ఇష్టం లేక తనను పని కూడా మాన్పించడంతో ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేకుండా ఉంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 13 రాత్రి ఆషియానా పోలీసులు కైఫ్, హసీబ్‌లపై కేసు నమోదు చేశారు. ఆషియానా ఇన్‌స్పెక్టర్ గజేంద్ర రాయ్ ఈ వివరాలను ధ్రువీకరించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని, సేకరించిన ఆధారాల మేరకు తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us