IND vs ENG: ఆ ఒక్కడ్ని తీసేస్తే.. విజయానికి రూట్‌ క్లియర్‌ అయినట్లే..! భారమంతా ఆ బౌలర్‌పైనే..!

రెండో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. శుబ్మన్ గిల్ 269 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగుల వద్ద ఆట ముగించింది. ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు తీశాడు.

IND vs ENG: ఆ ఒక్కడ్ని తీసేస్తే.. విజయానికి రూట్‌ క్లియర్‌ అయినట్లే..! భారమంతా ఆ బౌలర్‌పైనే..!
Team India

Updated on: Jul 04, 2025 | 2:43 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రోజు 300 పైచిలుకు పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి రోజు ఆటలో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. కానీ, రెండో రోజు మాత్రం టీమిండియా ఇంగ్లాండ్‌ను డామినేట్‌ చేసిందనే చెప్పాలి. తొలి 5 వికెట్లకు 300 పరుగులు చేసిన భారత్‌.. తర్వాత 5 వికెట్లతో దాదాపు అన్నే పరుగులు సాధించి.. ఇంగ్లాండ్‌ బౌలర్లపై పైచేయి సాధించింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఏకంగా డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. అతని 269 పరుగుల ఇన్నింగ్స్‌తో టీమిండియా భారీ స్కోర్‌ సాధ్యమైంది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

అలాగే రెండో రోజు చివర్లో తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లు ఊహించని షాక్‌ ఇచ్చారు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్‌ దీప్‌.. బుమ్రా ఏం చేస్తాడో ఆల్‌మోస్ట్‌ అదే చేశాడు. ఆరంభంలోనే టీమిండియా రెండు కీలక వికెట్లు అందించిపెట్టాడు. అలాగే మొహమ్మద్‌ సిరాజ్‌ సైతం ఒక వికెట్‌ తీసుకున్నాడు. దీంతో కేవలం 25 పరుగులకే ఇంగ్లాండ్‌ 3 కీలక వికెట్లు కోల్పో్యింది. తొలి టెస్ట్‌లో సెంచరీలతో చెలరేగిన బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌ ఈ సారి డకౌట్‌ అయ్యారు. ఇద్దర్ని కూడా ఆకాశ్‌ దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఓపెనర్‌ జాక్‌ క్రాలేను సిరాజ్‌ అవుట్‌ చేశాడు. మొత్తంగా 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆటను ముగించింది.

ఇక మూడో రోజు ఇంగ్లాండ్‌ ఎంత తక్కువ స్కోర్‌కు టీమిండియా బౌలర్లు ఆలౌట్‌ చేయగలిగితే విజయావకాశాలు అంత పెరుగుతాయి. మరీ ముఖ్యంగా టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా లేని లోటు తీర్చడంతో పాటు.. ఇంగ్లాండ్‌ సీనియర్‌ మోస్ట్‌ ప్లేయర్‌, క్రీజ్‌లో పాతకుంటే మర్రిచెట్టులా మారే జో రూట్‌ను అవుట్‌ చేయాలి. అతన్ని ఎంత తొందరగా పెవిలియన్‌కు పంపగలిగితే.. మిగతా వికెట్లు అంత ఫాస్ట్‌గా చుట్టేయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో అతనే కీలకం కానున్నాడు. ఇక రెండో రోజు ఆకాశ్‌ దీప్‌ వేసిన బౌలింగ్‌ చూస్తే.. అతనిపై ఆశలు పెట్టుకోవచ్చు అనిపిస్తోంది. మూడో రోజు రూట్‌ను ఆకాశ్‌ దీప్‌ కనుక అవుట్‌ చేస్తే.. మిగతా బౌలర్లు కూడా చెలరేగే కాన్ఫిడెన్స్‌ వచ్చేస్తోంది. సో.. రూట్‌ను అవుట్‌ చేసి విజయానికి రూట్‌ క్లియర్‌ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆకాశ్‌ దీప్‌పై ఉందని అనుకోవచ్చు. అలాగే సిరాజ్‌ కూడా ఒక్కసారి వికెట్ల రుచి చూశాడంటే.. పులి రక్తం వాసన చూసినట్లే ఉంటుంది. అతనిపై కూడా కొంత బాధ్యత ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి