
భారత క్రికెట్ జట్టు సహాయ కోచ్ రయాన్ టెన్ డస్కేట్ తన బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు సమాచారం. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి అనుమతి లభిస్తే, ఇంగ్లాండ్తో జూలై 19న జరగనున్న మూడో వన్డే అనంతరం భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం.. తన నిర్ణయాన్ని టెన్ డస్కేట్ ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తనను ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నెదర్లాండ్స్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్ అయిన టెన్ డస్కేట్ రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్గా బాధ్యతలు చేపట్టారు. అతని తొలి ఒప్పందం ఇటీవల ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండటంతో, ఆ సిరీస్ ముగిసిన తర్వాత అధికారికంగా వైదొలగే అవకాశం ఉందని సమాచారం. టెన్ డస్కేట్ నిర్ణయం వెనుక కుటుంబ కారణాలే ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. లండన్లో నివసిస్తున్న తన కుటుంబంతో, ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న భార్యతో పాటు ముగ్గురు చిన్న కుమారులతో ఎక్కువ సమయం గడపాలని ఆయన కోరుకుంటున్నట్లు సమాచారం. భారత జట్టుతో పనిచేయడం వల్ల తరచూ విదేశీ పర్యటనలు చేయాల్సి రావడం కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితిని తీసుకొచ్చిందని, అందుకే తక్కువ ప్రయాణాలతో కూడిన ఉద్యోగాన్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జట్టులో తన బాధ్యతల విషయంలో కూడా కొంత స్పష్టత లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. ఫీల్డింగ్ అతని ప్రధాన నైపుణ్యమైనప్పటికీ, భారత జట్టుకు ఇప్పటికే టి.దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా కొనసాగుతుండటంతో టెన్ డస్కేట్ పాత్ర కొంత పరిమితమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో టెన్ డస్కేట్కు మంచి అనుబంధం ఉంది. భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో గంభీర్ సిఫార్సుతోనే ఆయన సహాయ కోచ్గా నియమితులయ్యారు. జట్టు వ్యూహాలు, శిక్షణ కార్యక్రమాల్లో కూడా గంభీర్ ఆయనపై విశ్వాసం ఉంచినట్లు పలుమార్లు వెల్లడైంది. అయితే టెన్ డస్కేట్ రాజీనామాను గంభీర్ అంగీకరిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బీసీసీఐ నుంచి కూడా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు టెన్ డస్కేట్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి