T20 World Cup 2026 : పాయింట్ల పట్టికలో ప్రకంపనలు..సూపర్-8 రేసులో వెనుకబడ్డ ఇంగ్లాండ్..దుమ్మురేపుతున్న విండీస్

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక తలకిందులవుతోంది. ఫిబ్రవరి 11న జరిగిన కీలక పోరులో వెస్టిండీస్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో సూపర్-8 ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి.

T20 World Cup 2026 : పాయింట్ల పట్టికలో ప్రకంపనలు..సూపర్-8 రేసులో వెనుకబడ్డ ఇంగ్లాండ్..దుమ్మురేపుతున్న విండీస్
T20 Wc 2026 Points Table

Updated on: Feb 12, 2026 | 1:27 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక తలకిందులవుతోంది. ఫిబ్రవరి 11న జరిగిన కీలక పోరులో వెస్టిండీస్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో సూపర్-8 ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్లుగా వెలిగిన ఇంగ్లాండ్ టీమ్, ఇప్పుడు తదుపరి రౌండ్‌కు చేరుతుందా లేదా అన్న ఆందోళనలో పడిపోయింది. తాజా పాయింట్ల పట్టిక వివరాలు, గ్రూపుల వారీగా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

గ్రూప్-సి: ఇంగ్లాండ్ కష్టాల్లో.. విండీస్ ఖుషీ

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన వెస్టిండీస్ 4 పాయింట్లతో గ్రూప్-సిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒకటి ఓడిపోయినప్పటికీ.. రన్ రేట్ తక్కువగా ఉండటంతో స్కాట్లాండ్ కంటే వెనుకబడి మూడో స్థానంలో ఉంది. సూపర్-8కి వెళ్లాలంటే ఇంగ్లాండ్ ఇకపై ప్రతి మ్యాచ్ గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

గ్రూప్-డి: సూపర్ ఓవర్ల రికార్డు.. కివీస్ హవా

సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. నిర్ణీత సమయంలో స్కోర్లు సమం కావడంతో ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. చివరకు సౌతాఫ్రికా విజయం సాధించినా.. పాయింట్ల పట్టికలో మాత్రం రెండో స్థానానికే పరిమితమైంది. న్యూజిలాండ్ (+1.919) రన్ రేట్ సౌతాఫ్రికా (+1.425) కంటే మెరుగ్గా ఉండటంతో కివీస్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ ఓటమి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

గ్రూప్-బి: ఆసీస్ అరాచకం

గ్రూప్-బిలో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌లోనే భారీ విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇతర జట్లతో పోలిస్తే ఆసీస్ రన్ రేట్ అత్యధికంగా ఉండటంతో ప్రస్తుతానికి ఆ గ్రూప్‌లో వాళ్లే బాస్‌లా కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా సూపర్-8 రేసు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.

గ్రూప్-ఏ: భారత్ వర్సెస్ పాకిస్థాన్

ప్రస్తుతానికి గ్రూప్-ఏలో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయితే టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి విజయం సాధించింది. నేడు నమీబియాతో జరగబోయే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధిస్తే, పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. ఎందుకంటే భారత నెట్ రన్ రేట్ పాక్ కంటే చాలా మెరుగ్గా ఉంది. ఈ పోరు సూపర్-8 గ్రూపింగ్స్‌లో కూడా కీలకం కానుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us