Fielding Coach : వరల్డ్ కప్ గెలిచినా వేటు తప్పదా? టీమిండియా దిగ్గజ కోచ్ భవితవ్యంపై ఉత్కంఠ
Fielding Coach : టీ20 ప్రపంచకప్ గెలిచినా టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యాల నేపథ్యంలో కోచ్ టి. దిలీప్ భవితవ్యం ప్రమాదంలో పడింది. జూన్ 2026తో ఆయన కాంట్రాక్ట్ ముగియనుండటంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. రాహుల్ ద్రవిడ్ హయాంలో ఎంట్రీ ఇచ్చిన ఆయన, 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత తప్పుకోవాల్సి ఉంది.

Fielding Coach : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు తిరుగులేని విజయాన్ని సాధించి ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అజేయంగా టోర్నీని ముగించిన సూర్యకుమార్ యాదవ్ సేనకు బీసీసీఐ ఇప్పటికే రూ.131 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. అయితే, ఒకవైపు ఈ సంబరాలు జరుగుతుండగానే.. మరోవైపు జట్టులోని ఒక కీలక వ్యక్తి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయనే టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్.
విజయం దక్కినా.. వేటు తప్పదా?
భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పటికీ, టోర్నీ పొడవునా టీమిండియా ఫీల్డింగ్ తీరు విమర్శలకు గురైంది. ఈ టోర్నీలో అత్యధిక క్యాచ్లు చేజార్చిన జట్టుగా భారత్ నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఫైనల్లో కూడా ఫీల్డింగ్ తప్పిదాలు స్పష్టంగా కనిపించాయి. 2021 నుంచి జట్టుతో ఉన్న టి. దిలీప్ కాంట్రాక్ట్ జూన్ 2026తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, అతనిని కొనసాగిస్తారా లేక కొత్త ముఖాన్ని వెతుక్కుంటారా అన్నది ఇప్పుడు బీసీసీఐ ముందున్న పెద్ద ప్రశ్న.
రోహిత్ అండతోనే తిరిగొచ్చిన దిలీప్
వాస్తవానికి, టి.దిలీప్ ప్రస్థానం ఎన్నో మలుపులతో సాగింది. రాహుల్ ద్రవిడ్ హయాంలో ఎంట్రీ ఇచ్చిన ఆయన, 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత తప్పుకోవాల్సి ఉంది. అయితే అప్పుడు ఆయన పదవీకాలాన్ని మార్చి 2025 వరకు పొడిగించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల మధ్యలోనే ఆయనను తొలగించినప్పటికీ, కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకుని గౌతమ్ గంభీర్, బోర్డుని రిక్వెస్ట్ చేయడంతో దిలీప్కు మరో ఏడాది ఎక్స్టెన్షన్ లభించింది. ఇంగ్లాండ్ పర్యటన నుంచి ఆయన మళ్లీ బాధ్యతలు చేపట్టారు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ ముగియడం, ఫీల్డింగ్ ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బోర్డు పునరాలోచనలో పడింది.
విదేశీ కోచ్ వైపు బీసీసీఐ చూపు?
గతంలోనే టి.దిలీప్కు ప్రత్యామ్నాయంగా విదేశీ ఫీల్డింగ్ కోచ్ కోసం బీసీసీఐ వేట సాగించింది. కానీ సరైన అభ్యర్థి దొరకకపోవడంతో మళ్లీ దిలీప్కే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన దిలీప్, 2007 నుంచి 2019 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో, ఆపై ఎన్ సీఏలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఇతర జట్లతో పోటీ పడాలంటే మరింత అధునాతన ఫీల్డింగ్ మెళకువలు అవసరమని బోర్డు భావిస్తోంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం కూడా కొత్త కోచ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం చూస్తుంటే, టీమిండియా ప్రధాన జట్టులోకి కూడా కొత్త ఫీల్డింగ్ కోచ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
