Suryakumar Yadav: కెప్టెన్సీ పోయిందనే కోపం.. కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తన సత్తా చాటాడు. ముంబై టీ20 టోర్నమెంట్‌లో 36 బంతుల్లో 72 పరుగులు చేసి తన విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. కెప్టెన్సీ కోల్పోయిన కసిని బ్యాటింగ్‌లో చూపించిన సూర్య, ట్రయంఫ్స్ నైట్స్ జట్టును విజయతీరాలకు చేర్చి, ఫామ్ కోల్పోలేదని నిరూపించాడు.

Suryakumar Yadav: కెప్టెన్సీ పోయిందనే కోపం.. కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
Suryakumar Yadav

Updated on: Jun 09, 2026 | 11:44 AM

టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెలెక్టర్లుకు ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు, తన పని అయిపోయిందకున్న వారికి తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. తన బ్యాటింగ్‌‌లో పదును తగ్గింది, ఫామ్ పోయిందని చెప్పిన వాళ్లు నోళ్లు మూయించేలా సూపర్ బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. ఇటీవలె సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. కొంత కాలంగా సరైన ఫామ్‌లో లేడనే కారణంతో సూర్యను కెప్టెన్సీ నుంచే కాకుండా ఏకంగా టీమ్‌ నుంచి కూడా తీసి పక్కనపెట్టారు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన సూర్య బ్యాట్‌తో కసిగా బదులిచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 టోర్నమెంట్‌లో సూర్య అద్భుతమైన ఇన్సింగ్స్‌లు ఆడాడు. ట్రయంఫ్స్ నైట్స్ MNE జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సోమవారం, వాంఖడే స్టేడియంలో MSC మరాఠా రాయల్స్‌పై తన జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తూ, అతను కేవలం 36 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా ఉంటూ మ్యాచ్ గెలిపించాడు. అంతకుముందు సిల్వెస్టర్ డిసౌజా బంతితో అద్భుతంగా రాణించి, ఐదు వికెట్లు పడగొట్టి మరాఠా రాయల్స్‌ను 19.5 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ చేశాడు. అతను 3.5 ఓవర్లలో 5/21 అనే అద్భుతమైన గణాంకాలతో తన బౌలింగ్‌ను ముగించాడు.

దీనికి ప్రతిస్పందనగా ట్రయంఫ్స్ నైట్స్ తొలి ఐదు ఓవర్లలోపే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తిన్నది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్, నూతన్ కుమార్ గోయల్‌తో జతకట్టి మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యం మరాఠా రాయల్స్‌కు మ్యాచ్‌ను దాదాపు అసాధ్యం చేసింది. సూర్యకుమార్ వాంఖడే స్టేడియం బౌండరీల వద్ద వరుసగా చూడచక్కని షాట్లతో చెలరేగి, 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. నూతన్ 42 బంతుల్లో 56 పరుగులతో విలువైన సహకారం అందించగా, ఆమె ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ చివర్లో ఫోర్ కొట్టి ఛేజ్‌ను స్టైల్‌గా ముగించడంతో, ట్రయంఫ్స్ నైట్స్ కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకు ముందు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ముంబై ఫాల్కన్స్‌తో జరిగిన తన గత మ్యాచ్‌లో కూడా సూర్య 24 బంతుల్లో వేగంగా 48 పరుగులు చేశాడు. అయితే ఇలాంటి బ్యాటింగ్ ఏదో ముందే ఐపీఎల్‌లో చేసి ఉంటే కెప్టెన్సీ పోయేది కాదు కదా అంటూ సోషల్ మీడియాలో సరదా కామెంట్లు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us