
టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్గా ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత జట్టుకు కొత్త కెప్టెన్ నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అలాగే సూర్య ప్లేస్లో కెప్టెన్ కాబోతున్నారంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ, తాజాగా బీసీసీఐ పంపిన ఓ ఆహ్వానంతో కెప్టెన్సీ అంశంపై క్లారిటీ వచ్చినట్లు అయింది. టీమిండియా త్వరలో ఆడబోయే టీ20 సిరీస్లకు జట్టు ఎంపిక చేసేందుకు సెలెక్టర్లతో పాటు మీటింగ్లో పాల్గొనాల్సిందిగా శ్రేయస్ అయ్యర్కు ఆహ్వానం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో సూర్య స్థానంలో అయ్యర్ కెప్టెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఎప్పుడో డిసెంబర్ 2023లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో చివరిసారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు నేరుగా కెప్టెన్గా జట్టులోకి తిరిగి రానున్నాడు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున 498 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో టీమిండియాలోకి రీఎంట్రి ఇస్తున్నాడు. టీమిండియా తదుపరి టీ20ఐ సిరీస్ ఐర్లాండ్ పర్యటనలో జరగనుంది. అక్కడ రెండు టీ20ఐలు ఆడిన తర్వాత, ఐదు టీ20ఐలు, మూడు వన్డేల కోసం ఇంగ్లాండ్కు బయలుదేరుతుంది. ఐర్లాండ్తో మొదటి టీ20ఐ జూన్ 26న, రెండవది జూన్ 28న జరగనుంది. కొత్త కెప్టెన్తో పాటు తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించడంపై బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చారని సమాచారం.
అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్య కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచినప్పటికీ.. సూర్య చాలా కాలంగా సరైన ఫామ్లో లేడు, టీ20 వరల్డ్ కప్తో పాటు తాజా ఐపీఎల్ సీజన్ 2026లో కూడా అతను పెద్దగా పరుగులు చేయలేదు. అతని పూర్ ఫామ్ దృష్ట్యా సూర్య టీమిండియా టీ20 టీమ్లో చోటు కోల్పోవచ్చు. అయ్యర్తో పాటు మరి కొంతమంది కొత్త ఆటగాళ్లు వైభవ్ సూర్యవన్షీ, రజత్ పాటిదార్ వంటి ఆటగాళ్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి