
Shreyas Iyer: ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి ముల్లన్పూర్ వేదికగా విఫలమయ్యాడు. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో స్వల్ప స్కోరుకే ఔట్ కావడంతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఈజీ విజయంతో ఫైనల్కు దూసుకెళ్లగా, పంజాబ్ క్వాలిఫైయర్ 2లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది.
ముల్లన్పూర్లోని మహారాజా యాదవింద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ను ప్రారంభించిన వెంటనే తడబడింది. ఆర్సీబీ బౌలర్లు, ముఖ్యంగా జోష్ హాజిల్వుడ్, యష్ దయాల్, సుయాష్ శర్మ అద్భుతంగా రాణించి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. పంజాబ్ కింగ్స్ కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది.
శ్రేయాస్ అయ్యర్ విఫలం..
ఈ సీజన్లో బ్యాటర్గా, కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 500కు పైగా పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ఉన్నాడు. అయితే, ముల్లన్పూర్ పిచ్పై, ముఖ్యంగా ఆర్సీబీకి వ్యతిరేకంగా అతని రికార్డు ఆందోళనకరంగా ఉంది. ఈ మ్యాచ్లో కూడా అతని వైఫల్యం కొనసాగింది. కేవలం 2 పరుగులు (3 బంతుల్లో) మాత్రమే చేసి, కీలక సమయంలో జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు. ఈ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ ఐదవసారి ఈ మైదానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ప్రతిసారీ, అతను ఘోరంగా విఫలమయ్యాడు. శ్రేయాస్ 5 ఇన్నింగ్స్లలో ఒక్కసారి మాత్రమే రెండంకెల మార్కును దాటాడు. ఈ సీజన్లో ఈ మైదానం అతని పాలిట విలన్లా మారింది. ఇక్కడ అతను రాజస్థాన్ రాయల్స్ పై 10, చెన్నై సూపర్ కింగ్స్ పై 9, కోల్కతా నైట్ రైడర్స్ పై 0, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 6, 2 పరుగులకే పరిమిత మయ్యాడు.
హాజిల్వుడ్ మ్యాజిక్..
ఆర్సీబీ తరపున జోష్ హాజిల్వుడ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 3.1 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ వికెట్ తీయడం ఆర్సీబీకి చాలా కీలకం. హాజిల్వుడ్ బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్కు వ్యతిరేకంగా రికార్డు అంతగా బాగాలేదు. టీ20లలో హాజిల్వుడ్, అయ్యర్ను నాలుగు సార్లు ఔట్ చేశాడు. అయ్యర్ అతని బౌలింగ్లో సగటు కేవలం 2.75 మాత్రమే. ఈ మ్యాచ్లో కూడా అదే పోరులో అయ్యర్ ఓటమి పాలయ్యాడు. మాజీ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ టామ్ మూడీ మాట్లాడుతూ, శ్రేయాస్ అయ్యర్ ఈ పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడని, తన అహంకారాన్ని పక్కన పెట్టి మరింత జాగ్రత్తగా ఆడాల్సిందని వ్యాఖ్యానించాడు.
IPL 2025 లో అయ్యర్ ప్రదర్శన..
ఈ ఐపీఎల్లో శ్రేయాస్ అయ్యర్ 15 మ్యాచ్లు ఆడాడు. అతను 15 ఇన్నింగ్స్లలో 516 పరుగులు చేశాడు. అతని సగటు 46.91. అయ్యర్ 170.86 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 5 హాఫ్ సెంచరీలు వచ్చాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!