ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి సంచలనం.. ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!

భారత మహిళల క్రికెట్‌లో శ్రీ చరణి రూపంలో ఒక సరికొత్త సూపర్ స్టార్ ఆవిర్భవించింది. అత్యంత ఒత్తిడితో కూడిన ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో స్థిరమైన ప్రదర్శన చేస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్న ఈ యువ స్పిన్నర్, రాబోయే సెమీఫైనల్ పోరులోనూ ఇదే విధమైన ప్రదర్శనతో భారత్‌కు ప్రపంచకప్ అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి సంచలనం.. ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!
Shree Charani, Womens T20 World Cup 2026

Updated on: Jun 25, 2026 | 9:46 PM

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో అద్భుతమైన బౌలింగ్‌తో మెరిసిన ఆమె, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది. శ్రీ చరణి మాయాజాలంతో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు మెరుగయ్యాయి.

బంగ్లాదేశ్ దూకుడుకు బ్రేకులు.. శ్రీ చరణి స్పిన్ మాయాజాలం

గురువారం జరిగిన ఈ చావో రేవో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఒక దశలో ఒక వికెట్ నష్టానికి 59 పరుగులు చేసి మంచి ఊపుమీద కనిపించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. ముఖ్యంగా నిగార్ సుల్తానా సారథ్యంలోని బంగ్లా జట్టును 136 పరుగులకే పరిమితం చేయడంలో రాధా యాదవ్ మూడు వికెట్లతో రాణించగా, శ్రీ చరణి వేసిన స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఆమె తీసిన ఆ రెండు వికెట్లు బంగ్లాదేశ్ భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ రెండు వికెట్లతో కలిపి శ్రీ చరణి ఈ టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే మొత్తం 12 వికెట్లు తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది.

పూనమ్ యాదవ్ రికార్డు బద్దలు.. అగ్రస్థానంలో నిలిచిన చరణి

ఇంతకుముందు, 2020 టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో భారత స్టార్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 10 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. తాజాగా బంగ్లాదేశ్‌పై తీసిన వికెట్లతో శ్రీ చరణి ఆ రికార్డును అధిగమించి, భారత్ తరఫున ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నంబర్ వన్ బౌలర్‌గా నిలిచింది.

ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారు:

శ్రీ చరణి – 12 వికెట్లు (2026)

పూనమ్ యాదవ్ – 10 వికెట్లు (2020)

డయానా డేవిడ్ – 9 వికెట్లు (2010)

పూనమ్ యాదవ్ – 8 వికెట్లు (2014, 2018)

రాధా యాదవ్ – 8 వికెట్లు (2018)

ప్రపంచ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, ఒకే మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ (15 వికెట్లు, 2024) పేరిట ఉంది. ప్రస్తుతం 12 వికెట్లతో ఉన్న శ్రీ చరణి ఆ రికార్డుకు కూడా చేరువలో ఉండటం విశేషం.

టోర్నీ అంతటా శ్రీ చరణి విశ్వరూపం

ఈ ప్రపంచకప్‌లో శ్రీ చరణి ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో అదరగొట్టిన ఈ యువ సంచలనం, నెదర్లాండ్స్‌పై కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లతో చెలరేగింది. ఆ తర్వాత శక్తివంతమైన సౌతాఫ్రికా జట్టుపై కూడా 3 వికెట్లతో సత్తా చాటింది. బంగ్లాదేశ్‌పై తీసిన 2 వికెట్లే ఈ టోర్నీలో ఆమెకు అత్యల్ప ప్రదర్శన అంటే, ఈ మెగా టోర్నీలో ఆమె ఏ స్థాయి ప్రమాణాలను నెలకొల్పిందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us