ఎస్‌ఆర్‌హెచ్‌ టీంలో విండీస్ స్టార్ క్రికెటర్.. 2019లో ముంబైకి టైటిల్ అందించి, సీపీఎల్‌లో సునామీ సృష్టిస్తోన్న ఆ ప్లేయర్ ఎవరంటే?

|

Sep 12, 2021 | 8:02 AM

IPL 2021: ఈ ఆటగాడు 2019 లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ టీంలో భాగంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో ప్రస్తుతం హైదరాబాద్ తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ టీంలో విండీస్ స్టార్ క్రికెటర్.. 2019లో ముంబైకి టైటిల్ అందించి, సీపీఎల్‌లో సునామీ సృష్టిస్తోన్న ఆ ప్లేయర్ ఎవరంటే?
Sherfane Rutherford
Follow us on

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్ రెండవ దశ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు జరగనుంది. ఇందుకోసం అన్ని జట్లు సన్నాహాలు మొదలుపెట్టాయి. కానీ, రెండో దశ ప్రారంభానికి ముందే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ఇంగ్లండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో వ్యక్తిగత కారణాల వల్ల లీగ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం అతని స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన స్టార్ ఆటగాడిని బరిలోకి దించనుంది. ఈ ఆటగాడి పేరు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. బెయిర్‌స్టో స్థానంలో విండీస్ ఆటగాడిని జట్టులో చేర్చినట్లు సన్‌రైజర్స్ ట్విట్టర్‌లో తెలిపింది.

“వెస్టిండీస్ టీం తుఫాను బ్యాట్స్‌మెన్ ఇప్పుడు రైసర్‌ టీంలో.. ఐపీఎల్ 2021 రెండో దశలో జానీ బెయిర్‌స్టో స్థానంలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ జట్టులోకి వచ్చాడు” అంటూ రాసుకొచ్చింది.

ముంబై ఇండియన్స్‌కు టైటిల్ ఇచ్చాడు..
ఢిపెడింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కోసం రూథర్‌ఫోర్డ్ గతంలో ఐపీఎల్‌లో ఆడాడు. అతను ఐపీఎల్ 2019 లో ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు. 2019 లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ముంబై ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్‌లో ఆడటం ఇదే మొదటిసారి. అతను ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 73 పరుగులు చేశాడు. అంతకుముందు, 2018 లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది. కానీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి అవకాశం రాలేదు. అతను 2018 లోనే వెస్టిండీస్ జట్టులో ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో టీ 20 లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన జాతీయ జట్టు కోసం మొత్తం ఆరు టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.

ప్రస్తుతం సీపీఎల్‌లో..
రూథర్‌ఫోర్డ్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ కోసం ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో అతను ఇప్పటివరకు మూడు అర్ధ సెంచరీలు బాదేశాడు. బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 43 బంతుల్లో 53 పరుగులు చేశాడు. దీని తరువాత గయానా అమెజాన్ వారియర్స్‌పై 34 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టును విజయాన్ని అందించాడు. తర్వాతి మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై 26 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో అజేయంగా 50 పరుగులు చేసి తన జట్టుకు ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు.

Also Read: ఐసీసీ తలపు తట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. మాంచెస్టర్ ఫలితంపై నిర్ణయం తీసుకోవాలంటూ లేఖ.. అసలేం జరుగుతోందంటే?

టీమిండియా ఆల్ రౌండర్‌ కుటుంబంలో వివాదం.. సోదరి, భార్యల మధ్య చిచ్చు పెట్టిన కోవిడ్ -19 రూల్స్.. ఎందుకో తెలుసా?