
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా స్టార్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలిసారి ఒకే వేదికపై సందడి చేశారు. ఇండియా టుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ఈ ఇద్దరు ఓపెనర్లు తమ మధ్య ఉన్న స్నేహాన్ని, సరదా జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మకు వస్తున్న విపరీతమైన క్రేజ్ చూసి జట్టులోని మిగతా ఆటగాళ్లకు కాస్త జలస్గా ఉండేదని సంజూ శాంసన్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ అంతా అభిషేక్.. అభిషేక్ అంటూ గోల చేస్తుంటే, మాకెవ్వరికీ ఫ్యాన్స్ లేరా ఏంటి అని మేమంతా జోకులు వేసుకునేవాళ్లమని సంజూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఇదే క్రమంలో అభిషేక్ శర్మను ఆటపట్టిస్తూ సంజూ ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు. అభిషేక్ క్రేజ్ ఇలాగే ఉంటే మిగతా వాళ్లకి లైమ్లైట్ దక్కడం కష్టమని, అందుకే అతను త్వరగా పెళ్లి చేసుకుంటే ఆ క్రేజ్ కాస్త తగ్గుతుందేమోనని చమత్కరించాడు. సంజూ చేసిన ఈ మ్యారేజ్ అడ్వైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రపంచకప్లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా రాణించి 5 ఇన్నింగ్స్ల్లో 321 పరుగులు సాధించాడు. ఫైనల్లో 89 పరుగులతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.
మరోవైపు, టీ20 ర్యాంకింగ్స్లో నంబర్-1 బ్యాటర్గా ఉన్న అభిషేక్ శర్మ, టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డాడు. కానీ అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం తన పంజా విసిరాడు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. తన సక్సెస్ గురించి మాట్లాడుతూ.. మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ తనకు వెన్నెముకలా నిలిచారని అభిషేక్ తెలిపాడు. గత రెండేళ్లుగా యువీ చెప్పిన పద్ధతులనే ఫాలో అవుతున్నానని, ఫలితాల గురించి ఆలోచించకుండా కేవలం జట్టును గెలిపించడంపైనే దృష్టి పెట్టాలని ఆయన నేర్పించారని గుర్తు చేసుకున్నాడు.
టీమిండియా తరఫున కేవలం టీ20ల్లోనే కాకుండా మూడు ఫార్మాట్లలోనూ రాణించడమే తన తదుపరి లక్ష్యమని అభిషేక్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ గెలిచిన జోష్లో ఉన్న ఈ ఇద్దరు యంగ్ సెన్సేషన్లు, మైదానంలోనే కాకుండా మైకు ముందు కూడా తమ మాటలతో అభిమానులను అలరించారు. భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఈ ఇద్దరు ఓపెనర్ల కెరీర్ మరో మలుపు తిరుగుతుందనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..