
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ల మధ్య రికార్డుల సమరం పీక్కు చేరింది. వికెట్ కీపర్గా అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ శరవేగంగా అతని రికార్డును చేరుకునే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ ఇద్దరి పోటీతో టీమిండియా ఓపెనింగ్, కీపింగ్ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. అయితే, జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టీ20ఐలో ఇషాన్ కిషన్ 13వ ఓవర్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతను 31 బంతుల్లో యాభై పరుగులు సాధించాడు. ఇది అతనికి 12వ టీ20ఐ అర్ధశతకం. బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్లో సింగిల్ తీసి అతను ఈ ఘనతను సాధించాడు. దీంతో ప్రస్తుతం 14 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. సూర్యవంశీ 20, అభిషేక్ శర్మ 8 పరుగులు చేసి అవుటయ్యారు. ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 పరుగుల వద్ద బ్రయాన్ బెన్నెట్ బౌలింగ్లో అవుటయ్యాడు.
భారత పొట్టి ఫార్మాట్ చరిత్రలో ఒక వికెట్ కీపర్గా అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రికార్డు సంజూ శాంసన్ పేరిట ఉంది. సంజూ శాంసన్ ఇప్పటివరకు వికెట్ కీపర్ హోదాలో 8 సార్లు యాభై ప్లస్ స్కోర్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, అతని అగ్రస్థానానికి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది.
డాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇప్పటికే కీపర్గా 6 అర్ధశతకాలతో రెండో స్థానానికి చేరుకున్నాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇషాన్ మరో రెండు అర్ధశతకాలు సాధిస్తే సంజూ రికార్డును సమం చేయడంతో పాటు, అధిగమించే అవకాశం కూడా ఉంది. వీరి తర్వాత స్థానంలో మాజీ వికెట్ కీపర్, దిగ్గజ బ్యాటర్ కేఎల్ రాహుల్ 3 యాభై ప్లస్ స్కోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు వికెట్ కీపర్లతో సంబంధం లేకుండా, మొత్తం భారత టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక యాభై ప్లస్ స్కోర్లు చేసిన ఘనత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సొంతం. కోహ్లీ ఏకంగా 39 సార్లు ఈ మైలురాయిని అందుకుని అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 37 యాభై ప్లస్ స్కోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుత జట్టులో సూర్యకుమార్ యాదవ్ 29 అర్ధశతకాలతో మూడో స్థానంలో నిలవగా, కేఎల్ రాహుల్ 24 సార్లు యాభై ప్లస్ స్కోర్లు సాధించాడు. వర్ధమాన ఆటగాళ్ల విషయానికి వస్తే, యువ రికార్డుల వీరుడు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 13 యాభై ప్లస్ స్కోర్లతో కొనసాగుతుండటం విశేషం. అలాగే భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 11 సార్లు ఈ ఘనత సాధించాడు.
గతంలో టీమిండియాలో వికెట్ కీపర్ స్థానానికి సరైన ప్రత్యామ్నాయం దొరకడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తుది జట్టులో ఒక స్థానం కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నడుస్తోంది. లభించిన అవకాశాలను ఇద్దరూ రెండు చేతులా ఒడిసిపట్టుకుంటూ పరుగులు పిండుకుంటున్నారు.
టాప్ ఆర్డర్లో ఆక్రమణ శైలిలో ఆడటంతో పాటు వికెట్ల వెనుక కూడా అద్భుతంగా రానిస్తుండటంతో జట్టు మేనేజ్మెంట్కు ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తీపి తలనొప్పి ఎదురవుతోంది. రాబోయే కీలక సిరీస్లలో ఈ ఇద్దరి ప్రదర్శన బట్టే తుది జట్టులో వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..