AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : గాయం వల్ల తప్పుకున్నాడా.. లేక ఫామ్ కారణమా? సంజూ శాంసన్ అవుట్‌పై సరికొత్త వివాదం

Sanju Samson : ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో సంజూ శాంసన్‌ను తప్పించడంపై వివాదం చెలరేగింది. సంజయ్ మంజ్రేకర్ సెలెక్షన్‌ను తీవ్రంగా విమర్శించారు. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చిన బీసీసీఐ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. భారత్ ఓడిపోవడంతో విమర్శలు మరింత పెరిగాయి.

Sanju Samson : గాయం వల్ల తప్పుకున్నాడా.. లేక ఫామ్ కారణమా? సంజూ శాంసన్ అవుట్‌పై సరికొత్త వివాదం
Sanju Samson
Rakesh
|

Updated on: Jul 05, 2026 | 7:30 PM

Share

Sanju Samson : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచిన ఆటగాడిని ఇలాంటి కీలక మ్యాచ్‌లో పక్కనబెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా సెలెక్టర్లను ఎండగట్టారు.

సంజయ్ మంజ్రేకర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. “15 ఏళ్ల యువ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ భారత జెర్సీలో అరంగేట్రం చేయడం చూడటానికి చాలా బాగుంది. కానీ సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి? అతడిని జట్టు నుంచి డ్రాప్ చేశారా? నాతో జోక్ చేస్తున్నారా! సంజూ ఏదైనా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని నేను భావిస్తున్నాను. ఒకవేళ అది నిజం కాకపోతే.. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత వింతైన సెలెక్షన్ అవుతుంది. ఒకవేళ వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే, సంజూను కాకుండా నంబర్ 3 పొజిషన్‌లో అతడిని ఆడించాల్సింది” అని మంజ్రేకర్ ఘాటుగా విమర్శించారు.

బీసీసీఐ ఈ మ్యాచ్‌లో భవిష్యత్తు స్టార్‌గా భావిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే దీనికోసం టీ20 ఫార్మాట్‌లో ఎంతో అనుభవమున్న సంజూ శాంసన్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. వైభవ్ తన మొదటి మ్యాచ్‌లో భయం లేని బ్యాటింగ్‌తో రెండు భారీ సిక్సర్లు బాదినప్పటికీ, కేవలం 14 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సంజూ శాంసన్ ఇటీవలి కాలంలో సరైన ఫామ్‌లో లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ, అలాగే ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ సంజూ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఈ క్రమంలోనే మేనేజ్‌మెంట్ కొత్త రక్తాన్ని పరీక్షించాలని భావించినట్లు తెలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37), తిలక్ వర్మ (24 నాటౌట్) రాణించడంతో భారత్ మంచి పొజిషన్‌లో నిలిచింది. అయితే 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాకబ్ బెథెల్ కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us