
IND vs SA 1st Test: భారత్, సౌతాఫ్రికా మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న నిర్ణయాలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. తుది జట్టులో ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఆడించాలనే వ్యూహంలో భాగంగా యువ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ను పక్కన పెట్టారు. ఇదిలావుంటే ఈ టెస్ట్కు ముందు సౌతాఫ్రికా జట్టుకు కూడా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేస్ బౌలర్ కగిసో రబాడ గాయం కారణంగా చివరి నిమిషంలో జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది.
కోల్కతా టెస్ట్లో భారత జట్టు ఏకంగా నలుగురు స్పిన్నర్లతో (జడేజా, సుందర్, అక్షర్, కుల్దీప్) బరిలోకి దిగాలనే వ్యూహాన్ని అమలు చేసింది. దీని కారణంగా జట్టులో పెద్ద మార్పు జరిగింది. గత టెస్టుల్లో నంబర్ 3లో బ్యాటింగ్ చేసిన యువ ఆటగాడు సాయి సుదర్శన్ను తుది జట్టు నుంచి తప్పించారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్, కోల్కతా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని స్పిన్నర్లకు అనుకూలమైన జట్టును ఎంచుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
సాయి సుదర్శన్ జూన్ 2025లో ఇంగ్లాండ్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆడిన 5 టెస్టుల్లో అతను 30.33 సగటుతో 273 పరుగులు (2 హాఫ్ సెంచరీలు సహా) చేశాడు. ఈ 5 టెస్టుల్లో 3 ఇంగ్లాండ్లో, 2 భారత్లో (అహ్మదాబాద్, ఢిల్లీ) ఆడాడు. సాయి సుదర్శన్ స్థానంలో తుది జట్టులోకి అక్షర్ పటేల్ను తీసుకున్నారు. దీంతో భారత జట్టులో స్పిన్ బౌలింగ్, ఆల్రౌండర్ సామర్థ్యం పెరిగింది.
సుదర్శన్ లేకపోవడంతో నంబర్ 3 స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ గత టెస్ట్ జట్టులో ఉన్నవారే. భారత్ తమ వ్యూహంలో భాగంగా ఒక కీలక ఆటగాడిని తప్పించగా, సౌతాఫ్రికా జట్టుకు మరో విధంగా ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ సిరీస్లోని తొలి టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ సమయంలో తీవ్రమైన గాయం (పక్కటెముకలకు) తగలడంతో జట్టు నుంచి అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన రబాడ వైదొలగడం పేస్ బౌలింగ్పై ఆధారపడే సౌతాఫ్రికాకు పెద్ద నష్టంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..