
Rohit Sharma : భారత క్రికెట్ దిగ్గజం, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్పై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్యలోనే ఆయన అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అఫవాహులు వచ్చాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ అధికారికంగా తిరస్కరించింది. అయినప్పటికీ 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే అతిపెద్ద ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. ఒకవేళ 2027 వరల్డ్ కప్నకు రోహిత్ను సెలెక్ట్ చేయకపోతే ఆ నిర్ణయం సరైనదేనా? అసలు రోహిత్ను పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ ఎందుకు ఆలోచిస్తోందనే కోణంలో ఆసక్తికరమైన విశ్లేషణలు వస్తున్నాయి.
వాస్తవానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లోనే ఒక పెద్ద సంకేతాన్ని ఇచ్చింది. సెలెక్టర్లు ఇప్పుడు రోహిత్ శర్మ కంటే కూడా జట్టు భవిష్యత్తుపై, యువ ఆటగాళ్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వరుసగా విఫలమవుతుండటంతో జట్టులో అతని స్థానంపై ఒత్తిడి మరింత పెరిగింది.
ప్రస్తుత సంవత్సరంలో వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ బ్యాట్ పూర్తిగా మూగబోయింది. ఈ ఏడాది ఆయన ఆడిన 8 వన్డే మ్యాచ్లలో కేవలం 30.12 సగటుతో కేవలం 241 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లోనూ ఆయన నిరాశపరిచారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ మొదటి మ్యాచ్లో 11 పరుగులు చేసిన రోహిత్, కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 47 బంతులు ఎదుర్కొని కేవలం 26 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు.
2027 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది. అయితే సౌతాఫ్రికా పిచ్లపై రోహిత్ శర్మకు అత్యంత పేలవమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై రోహిత్ 14 వన్డే మ్యాచ్లు ఆడగా.. కేవలం 19.69 సగటుతో, 68.44 స్ట్రైక్ రేట్తో కేవలం 256 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఆయన చివరిసారిగా 2018లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు 6 వన్డేల్లో 170 పరుగులు చేశారు. అందులోనే ఒక మ్యాచ్లో 115 పరుగుల శతకం బాదారు. అంటే ఆ ఒక్క సెంచరీ ఇన్నింగ్స్ మినహాయిస్తే, మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్, బౌన్స్ పిచ్లపై పరుగులు చేయడానికి రోహిత్ తీవ్రంగా తడబడ్డారు. కాబట్టి 2027 వరల్డ్ కప్లో రోహిత్ను ఆడించడం టీమిండియాకు పెద్ద రిస్క్ కావచ్చు.
రోహిత్ శర్మ స్థానానికి మరోవైపు 24 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. జైస్వాల్ తన అద్భుతమైన ఫామ్తో దూసుకుపోతున్నాడు. 2025లో ఇంగ్లాండ్పైనే వన్డే కెరీర్ ప్రారంభించిన జైస్వాల్, ఇప్పటివరకు ఆడిన 6 వన్డే మ్యాచ్ల్లోనే 71.25 సగటుతో 285 పరుగులు సాధించాడు. ఈ చిన్న కెరీర్లోనే 2 అద్భుతమైన సెంచరీలు కూడా బాదాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డేలో కూడా 110 పరుగులతో నాటౌట్గా నిలిచి మెరిశాడు. జైస్వాల్ సంచలన ప్రదర్శన చూస్తుంటే రాబోయే ప్రపంచకప్ కోసం శుభ్మన్ గిల్కు జోడీగా అతడిని ఓపెనర్గా బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనివల్ల జట్టుకు రైట్ అండ్ లెఫ్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ దొరుకుతుంది. ఇది 2027 ప్రపంచకప్లో భారత్కు గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..