Rohit Sharma : అంతా మీ మీడియా మహత్యమే.. రోహిత్ రిటైర్మెంట్ గుసగుసలపై గిల్ పంచ్

Rohit Sharma : లార్డ్స్‌లో రోహిత్ శర్మ 138 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ అనంతరం రిటైర్మెంట్ పుకార్లు జోరందుకున్న వేళ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మీడియా సృష్టించిన ప్రచారమేనని స్పష్టం చేస్తూ, హిట్‌మ్యాన్ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఓటమిపైనా స్పందించాడు.

Rohit Sharma : అంతా మీ మీడియా మహత్యమే.. రోహిత్ రిటైర్మెంట్ గుసగుసలపై గిల్ పంచ్
Rohit Sharma

Updated on: Jul 20, 2026 | 8:43 AM

Rohit Sharma : లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వీరోచిత సెంచరీతో (138 పరుగులు) చెలరేగాడు. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత ఆయన బ్యాట్ పైకి లేపకపోవడం, లార్డ్స్ మెంబర్స్ బాల్కనీ నుంచి వచ్చిన స్టాండింగ్ ఓవేషన్‌కు పెద్దగా స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరంభంలో వచ్చిన విమర్శలకు తన బ్యాట్‌తోనే జవాబిచ్చిన రోహిత్ శర్మ, మ్యాచ్ ముగిశాక ఏమీ మాట్లాడకపోవడంతో ఇదే ఆయనకు చివరి వన్డే మ్యాచ్ కానుందా అనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా ఊపందుకుంది.

రోహిత్ శర్మ భవిష్యత్తు, రిటైర్మెంట్ ఊహాగానాలపై మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టత ఇచ్చాడు. రోహిత్ శర్మ ఇది తన ఆఖరి మ్యాచ్ అని తమతో గానీ, జట్టు యాజమాన్యంతో గానీ ఎలాంటి విషయం చెప్పలేదని గిల్ కొట్టిపారేశాడు. ఇవన్నీ కేవలం మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. విమర్శలు వస్తున్న వేళ రోహిత్ శర్మ ఆడిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని గిల్ కొనియాడాడు.

గిల్ మాట్లాడుతూ.. “రోహిత్ భాయ్ గత కొన్నేళ్లుగా ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అద్భుతమైన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆయన ఆడిన తీరు, ముఖ్యంగా ఒత్తిడిలో 138 పరుగులు చేసిన విధానం అద్భుతం. చివరికి వచ్చేసరికి పిచ్ కాస్త నెమ్మదించింది, అలాంటి పరిస్థితుల్లో పరుగులు చేయడం అంత సులభం కాదు. కానీ ఆయన శ్రమించిన తీరును చూడటం నిజంగా ఓ కంటికి పండగలా అనిపించింది” అని రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మ కొనసాగుతాడనే సంకేతాలను కెప్టెన్ మాటలు ప్రతిబింబించాయి.

మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరివరకు పోరాడి 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ (138), విరాట్ కోహ్లీ (74), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (77) అద్భుతమైన హాఫ్ సెంచరీలు, సెంచరీలతో రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ (142), జాకబ్ బెథెల్ (91)తో పాటు ఆఖర్లో జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది.

భారత మిడిలార్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0), కెఎల్ రాహుల్ (12) త్వరగా అవుట్ కావడంతో భారత్ ఆఖరి ఓవర్లలో ఓటమి వైపు పయనించింది. ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కర్రన్ (4 వికెట్లు) ఆఖరి ఓవర్లలో భారత రన్‌రేట్‌ను నియంత్రించి ఇంగ్లాండ్‌కు 27 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకోగా, భారత్ ఓటమితో పర్యటనను ముగించాల్సి వచ్చింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us