
Rishabh Pant Sister Likes Instagram Reel Shubman Gill Politics: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగిన తర్వాత టెస్టు జట్టు భవిష్యత్తు నాయకుడిగా రిషభ్ పంత్ను భావించారు. ఇందులో భాగంగానే అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే, అఫ్గానిస్థాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ప్రకటించిన జట్టులో పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. కేవలం ఫామ్ లేమి వల్లే పంత్ను తొలగించారని భావిస్తున్న తరుణంలో, దీని వెనుక కెప్టెన్ శుభ్మన్ గిల్ రాజకీయాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. పంత్ భవిష్యత్తులో తనకు ఎక్కడ పోటీగా మారుతాడోనని, గిల్ కావాలనే వెనుకనుంచి చక్రం తిప్పి వయసు పైబడిన కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్ స్థానంలో కూర్చోబెట్టాడనేది ఆ పోస్ట్ సారాంశం.
సాధారణ అభిమానులు చేసే ఇలాంటి ఆరోపణలను అంతా కొట్టిపారేసేవారే, కానీ ఈ వివాదానికి రిషభ్ పంత్ సొంత సోదరి సాక్షి పంత్ తోడవడంతో కథ సరికొత్త మలుపు తిరిగింది. గిల్ను విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఒక రీల్ను సాక్షి పంత్ లైక్ చేయడం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. పంత్ కుటుంబం కూడా గిల్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉందనడానికి ఇదే నిదర్శనమని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ రచ్చపై అటు పంత్ కానీ, ఇటు సాక్షి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
సాక్షి పంత్ చేసిన ఆ ఒక్క లైక్తో సోషల్ మీడియా వేదికగా పంత్, గిల్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడం ముమ్మాటికీ అన్యాయమని కొందరు వాదిస్తుంటే, గత కొంతకాలంగా ఇంగ్లాండ్ పర్యటన మినహా మిగిలిన సిరీస్లలో పంత్ ఘోరంగా విఫలమయ్యాడని, అందుకే సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారని మరికొందరు సమర్థిస్తున్నారు. మరోవైపు గిల్ను బద్నాం చేయడానికి కావాలనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారంటూ గిల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🚨 Rishabh Pant’s sister has liked an Instagram reel that says Shubman Gill has played politics with Rishabh Pant and removed him from the Vice Captaincy so that he don’t have any competition in Test captaincy. 🚨
Someone should tell her, that India lost 2-0 vs South Africa at… pic.twitter.com/DpNs4ACLKu
— Ahmed Says (@AhmedGT_) May 20, 2026
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో సంబంధం లేకపోయినప్పటికీ, జూన్ 6 నుంచి చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ పూర్తిస్థాయి బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన దేవదత్ పడిక్కల్తో పాటు హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ వంటి కుర్రాళ్లకు తొలిసారి చోటు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు పనిభారం తగ్గించేందుకు విశ్రాంతి కల్పించారు.
మైదానంలో ఆట కంటే కూడా ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ రాజకీయాలు, ఆటగాళ్ల మధ్య విభేదాలు బయటకు రావడం భారత క్రికెట్ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. కెప్టెన్సీ రేసు కోసం ఆటగాళ్ల మధ్య ఇలాంటి ప్రచ్ఛన్న యుద్ధాలు నడవడం జట్టు సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి ఈ వివాదంపై బీసీసీఐ పెద్దలు లేదా సదరు ఆటగాళ్లు స్పందించి చెక్ పెడతారేమో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..