Rinku Singh : ఓపెనర్లే కాదు.. ఫినిషర్ కూడా తుస్సుమన్నాడు.. రింకూ సింగ్ గణాంకాలు చూస్తే షాకే

Rinku Singh : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు ప్రయాణం ప్రస్తుతం ఆశించినంత సాఫీగా సాగడం లేదు. ఇప్పటివరకు మనం కేవలం ఓపెనర్ల వైఫల్యం గురించి, ముఖ్యంగా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం.

Rinku Singh : ఓపెనర్లే కాదు.. ఫినిషర్ కూడా తుస్సుమన్నాడు.. రింకూ సింగ్ గణాంకాలు చూస్తే షాకే
Rinku Singh

Updated on: Feb 24, 2026 | 2:45 PM

Rinku Singh : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు ప్రయాణం ప్రస్తుతం ఆశించినంత సాఫీగా సాగడం లేదు. ఇప్పటివరకు మనం కేవలం ఓపెనర్ల వైఫల్యం గురించి, ముఖ్యంగా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, టీమిండియాను అసలైన టెన్షన్‌లో పడేస్తుంది మాత్రం టీం ఫినిషర్ రింకూ సింగ్ ఫామ్. ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న రింకూ, ఈ మెగా టోర్నీలో మాత్రం దారుణంగా తడబడుతున్నాడు. ఎంతలా అంటే, అతను ఆడిన బంతుల కంటే చేసిన పరుగులు చాలా తక్కువగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లకు క్రీజులో కుదురుకోవడానికి ఎక్కువ సమయం ఉండదు. ఈ రోజుల్లో ఓపెనర్లే మొదటి బంతి నుంచే బాదాలని చూస్తుంటే, ఆఖర్లో వచ్చే ఫినిషర్ పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ మొదట్లో ఉన్న స్కోరు వేగాన్ని పెంచడమో లేదా వికెట్లు పడి కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఆదుకోవడమో చేయాల్సిన బాధ్యత ఫినిషర్‌ మీద ఉంటుంది. కానీ రింకూ సింగ్ విషయంలో ఇది రివర్స్ అవుతోంది. అతను క్రీజులోకి వచ్చి స్కోరు వేగాన్ని పెంచకపోగా, అనవసరంగా బంతులను వృధా చేస్తూ జట్టుపై ఒత్తిడి పెంచుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వరల్డ్ కప్‌లో రింకూ సింగ్ గణంకాలను ఒకసారి పరిశీలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతులు ఆడిన రింకూ కేవలం 6 పరుగులే చేశాడు. అంటే ఒక ఫినిషర్ నుంచి ఆశించే స్ట్రైక్ రేట్ అక్కడ మచ్చుకైనా కనిపించలేదు. నమీబియాపై 6 బంతుల్లో 1 పరుగు, పాకిస్థాన్‌పై 4 బంతుల్లో 11 పరుగులు, నెదర్లాండ్స్‌పై 3 బంతుల్లో 6 పరుగులు చేశాడు. పాక్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచినప్పటికీ, మ్యాచ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యాడు. మొత్తం 5 మ్యాచ్‌ల్లో కలిపి అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇందుకోసం ఏకంగా 29 బంతులు ఆడాడు.

ముఖ్యంగా సూపర్-8 రౌండ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో రింకూ ఆడిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ మ్యాచ్‌లో కనీసం ఖాతా కూడా తెరవకుండానే, కేశవ్ మహారాజ్ వేసిన బంతిని అనవసరంగా బాదబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒక బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాల్సిన సమయంలో రింకూ ఇలా వికెట్ పారేసుకోవడం చర్చకు దారితీసింది. పవర్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ నుంచి ఇలాంటి ప్రదర్శనను ఎవరూ ఊహించలేదు. సెమీస్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లకు ముందు రింకూ తన ఫామ్‌ను అందుకోకపోతే భారత్‌కు ఇబ్బందులు తప్పవు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us