
కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల నిరీక్షణను గతేడాది పటాపంచలు చేస్తూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఈ ఏడాది కూడా అదే జోరును రిపీట్ చేసింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఏకపక్ష ఫైనల్ పోరులో రజత్ పటీదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ 2026 ఛాంపియన్గా అవతరించింది.
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి పిచ్ సహకరించకపోయినా ఆరంభంలో బౌండరీల వర్షం కురిపించింది. అయితే, ఒకదశలో వరుసగా మూడు కీలక వికెట్లు కోల్పోయి జట్టు కాస్త ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. కానీ క్రీజులో ఉన్నది ‘కింగ్’ విరాట్ కోహ్లీ కాబట్టి అభిమానుల్లో ధీమా తగ్గలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటిచేత్తో ఇన్నింగ్స్ను నడిపించిన కోహ్లీ, తనదైన శైలిలో మ్యాచ్ను ముగించి ఆర్సీబీకి వరుసగా రెండో ఐపీఎల్ కీర్తి కిరీటాన్ని అందించాడు. ఈ చారిత్రాత్మక విజయంతో బెంగళూరు జట్టు కేవలం ట్రోఫీని మాత్రమే గెలవలేదు, టోర్నీ చరిత్రలోనే పలు అరుదైన రికార్డులను సైతం బద్దలు కొట్టింది.
𝘾.𝙃.𝘼.𝙈.𝙋.𝙄.𝙊.𝙉.𝙎 🏆🏆@RCBTweets have done it again ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/ww2zB98Xb8
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్ – 2010, 2011), మరొకరు రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ – 2019, 2020). ఇప్పుడు ఈ దిగ్గజాల సరసన ఆర్సీబీ యువ కెప్టెన్ రజత్ పటీదార్ (2025, 2026) చేరిపోయాడు. కెప్టెన్సీ చేపట్టిన అనతికాలంలోనే జట్టును వరుసగా రెండుసార్లు విజేతగా నిలిపి చరిత్ర సృష్టించాడు.
కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత వేగంగా రెండు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్న రికార్డును పటీదార్ తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 28 మ్యాచ్ల్లోనే ఆయన ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో రోహిత్ శర్మ 44 మ్యాచ్ల్లో, ఎంఎస్ ధోనీ 59 మ్యాచ్ల్లో, గౌతమ్ గంభీర్ 79 మ్యాచ్ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఆ తర్వాత ఫైనల్లో గెలిచి ట్రోఫీ అందుకోవడం అంత సులువు కాదు. గతంలో ఈ ఘనతను రాజస్థాన్ రాయల్స్ (2008), ముంబై ఇండియన్స్ (2017, 2019, 2020), గుజరాత్ టైటాన్స్ (2022), కోల్కతా నైట్ రైడర్స్ (2024) సాధించాయి. ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ఈ విజయంతో అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్ల జాబితాలో ఆర్సీబీ నాలుగో స్థానానికి చేరుకుంది.
ముంబై ఇండియన్స్: 5 టైటిళ్లు
చెన్నై సూపర్ కింగ్స్: 5 టైటిళ్లు
కోల్కతా నైట్ రైడర్స్: 3 టైటిళ్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 2 టైటిళ్లు
గతంలో “ఈసాలా కప్ నమ్దే” అంటూ సాగిన ఆర్సీబీ అభిమానుల నినాదం, ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా నిజమైంది. విరాట్ కోహ్లీ క్లాస్ ఆటతీరు, రజత్ పటీదార్ వ్యూహాత్మక కెప్టెన్సీ వెరసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఐపీఎల్ సామ్రాజ్యంలో తిరుగులేని శక్తులుగా నిలబెట్టాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..