Bengaluru Stampede: తొక్కిసలాట పాపం అంతా RCBదే.. పోలీసులేం దేవుళ్లు కాదు

బెంగళూరు తొక్కిసలాట కేసులో IPS‌ అధికారి వికాస్‌ కుమార్‌ సస్పెన్షన్‌ను సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ రద్దు చేసింది. RCB మేనేజ్‌మెంట్‌ కారణంగానే చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Bengaluru Stampede: తొక్కిసలాట పాపం అంతా RCBదే.. పోలీసులేం దేవుళ్లు కాదు
Bengaluru Stampede

Updated on: Jul 02, 2025 | 7:00 AM

బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మేనేజ్‌మెంట్‌ కారణమని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టేడియం దగ్గర లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడటానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కారణమని క్యాట్‌ స్పష్టం చేసింది. తొక్కిసలాటకు ఐపీఎస్‌ అధికారి వికాస్‌ కుమార్‌ కారణమంటూ కర్నాటక ప్రభుత్వం సస్పెన్షన్‌ విధించడాన్ని రద్దు చేసింది. అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు పోలీసులకు తగిన సమయం లభించలేదని వెల్లడించింది.

‘మూడు నుంచి ఐదు లక్షల మంది ప్రజలు గుమిగూడటానికి ఆర్సీబీనే కారణమని తేల్చిచెప్పింది. పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు వాళ్లు తీసుకోకుండా గందరగోళం సృష్టించారు. అకస్మాత్తుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలివచ్చారని తెలిపింది. అంత తక్కువ సమయంలో భద్రతా ఏర్పాట్లు చేస్తారని పోలీసుల నుంచి ఆశించలేం’’ అని ట్రైబ్యునల్‌ పేర్కొంది.

బెంగళూరు తొక్కిసలాట తరువాత సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్‌ అధికారి వికాస్‌ కుమార్‌.. తనపై చర్యలను సవాలు చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిని విచారించిన క్యాట్‌(బెంగళూరు బెంచ్‌).. పోలీసులు కూడా మానవులేనని, భగవంతులుకారని పేర్కొంది. వాళ్ల దగ్గర మంత్రదండాలేమీ లేవని వ్యాఖ్యానించింది. భారీ సంఖ్యలో తరలివచ్చే వారిని నియంత్రించేందుకు ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో అవసరమని, ఈ కేసులో పోలీసులకు సరైన సమయం ఇవ్వలేదనే విషయం స్పష్టమవుతోందని పేర్కొంటూ ఐపీఎస్‌పై సస్పెన్షన్‌ను రద్దు చేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ విక్టరీ పరేడ్‌ వేడుకల్లో జనం ప్రాణాలు కోల్పోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని , ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌దే బాధ్యత అని కర్నాటక ప్రభుత్వం పదేపదే చెబుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి