ధోని, రోహిత్ ఎవర్రా.. రాసిపెట్టుకోండి ఆర్సీబీ ఫ్యాన్స్.. తోపులను తొక్కిపడేయడానికే వచ్చా..

Rajat Patidar Comments IPL Trophy: ఎన్నో ఏళ్లపాటు కేవలం కాగితాలకే పరిమితమైన ఆర్‌సీబీ బలాన్ని గ్రౌండ్‌లో నిరూపించి చూపించాడు రజత్ పటిదార్. ఇప్పుడు జట్టులో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే 2027లో ఆర్‌సీబీ హ్యాట్రిక్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించడం అసాధ్యమేమీ కాదనిపిస్తోంది.

ధోని, రోహిత్ ఎవర్రా.. రాసిపెట్టుకోండి ఆర్సీబీ ఫ్యాన్స్.. తోపులను తొక్కిపడేయడానికే వచ్చా..
Rajat Patidhar Comments

Updated on: Jun 02, 2026 | 12:42 PM

Rajat Patidar Comments IPL Trophy: ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు ట్రోఫీలు గెలిచి చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పుడు మరో అద్భుతానికి తెరలేపింది. గత 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లతో సరికొత్త చరిత్ర లిఖించిన ఈ జట్టు, ఇప్పుడు క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ‘మహా రికార్డు’పై కన్నేసింది. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ కెప్టెన్లకు సైతం సాధ్యం కాని హ్యాట్రిక్ రికార్డును సాధిస్తామని ఆర్‌సీబీ సారథి రజత్ పటిదార్ ధీమా వ్యక్తం చేశారు.

ఆర్‌సీబీ సంచలన విజయాలు.. తిరుగులేని ప్రయాణం

ఒకప్పుడు ట్రోఫీ కోసం ప్రతి ఏడూ నిరాశతోనే ముగించే ఆర్‌సీబీ, గడిచిన రెండేళ్లలో ఐపీఎల్ రూపురేఖలనే మార్చేసింది. 2025 జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి ఆర్‌సీబీ తన మొదటి టైటిల్ కలను నిజం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 190 పరుగులు చేసిన బెంగళూరు, కృనాల్ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్, భువనేశ్వర్ కుమార్ వేసిన నిర్ణయాత్మక 19వ ఓవర్ సాయంతో ప్రత్యర్థిని కట్టడి చేసింది.

ఇది కూడా చదవండి: తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్‌ చేస్తే పరువైనా మిగిలేనుగా..!

ఆ విజయం యాదృచ్ఛికం కాదని నిరూపిస్తూ, 2026 మే 31న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఘన విజయం సాధించి ఆర్‌సీబీ తన టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. రసీఖ్ సలామ్ దార్ (3/27) బౌలింగ్ ధాటికి గుజరాత్ 155 పరుగులకే పరిమితమవగా, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది, మొత్తం 42 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు వరుసగా రెండో ట్రోఫీని అందించాడు.

ధోనీ, రోహిత్ రికార్డులపై పటిదార్ కన్ను..

ఈ చారిత్రాత్మక విజయాల అనంతరం ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే జట్టు డైరెక్టర్ మో బొబాట్ కెప్టెన్ రజత్ పటిదార్‌కు ఒక సవాల్ విసిరారు. “ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా మూడుసార్లు ట్రోఫీ గెలవలేదు. వచ్చే ఏడాది మూడో టైటిల్ కొడుతున్నామా?” అని ప్రశ్నించగా, పటిదార్ ఏమాత్రం తడబడకుండా, ఎంతో ప్రశాంతంగా “ఖచ్చితంగా (Definitely)” అంటూ ఒకే ఒక్క ముక్కలో సమాధానమిచ్చాడు.

ఇది కూడా చదవండి: Video: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్‌పై నిషేధంతోపాటు జరిమానా..!

ఈ ఒక్క మాటతో ధోనీ, రోహిత్ వంటి మహామహుల రికార్డులకు పటిదార్ సవాల్ విసిరినట్లయింది. చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) లలో వరుసగా రెండుసార్లు టైటిళ్లు గెలిచినప్పటికీ, హ్యాట్రిక్ కొట్టే అవకాశాన్ని మాత్రం చేజార్చుకున్నాయి. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా పేరొందిన రోహిత్, ధోనీలు ఐదేసి ట్రోఫీలు సాధించినా ఈ హ్యాట్రిక్ ఘనతను అందుకోలేకపోయారు.

సరికొత్త సామ్రాజ్యానికి నాంది..

ఒకవేళ రజత్ పటిదార్ అన్నట్లుగా ఆర్‌సీబీ వచ్చే ఏడాది కూడా టైటిల్ గెలిస్తే, అది క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద సంచలనంగా మారుతుంది. రోహిత్ శర్మ తన మొదటి నాలుగు ట్రోఫీలు గెలవడానికి 7 సీజన్లు తీసుకోగా, ధోనీకి 13 సీజన్లు పట్టింది. కానీ పటిదార్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి మూడు సంవత్సరాలలోనే మూడు ట్రోఫీలు సాధించి 100% విజయాల రేటుతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఇది ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్ల దశాబ్దాల ఆధిపత్యానికి గట్టి చెక్ పెట్టడమే కాకుండా, ఆర్‌సీబీని సరికొత్త సామ్రాజ్యంగా నిలబెడుతుంది.

ఇది కూడా చదవండి: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఒక్క మ్యాచ్ ఆడకుండా అకౌంట్‌లోకి కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే అవాక్కే..!

ఎన్నో ఏళ్లపాటు కేవలం కాగితాలకే పరిమితమైన ఆర్‌సీబీ బలాన్ని గ్రౌండ్‌లో నిరూపించి చూపించాడు రజత్ పటిదార్. ఇప్పుడు జట్టులో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే 2027లో ఆర్‌సీబీ హ్యాట్రిక్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించడం అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. అదే జరిగితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ల సరసన పటిదార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us