
India T20 Squad : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుకుంటున్న వేళ, మైదానంలో ఆటతో పాటు బయట చర్చలు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా భవిష్యత్తు టీ20 జట్టుపై దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో సంచలనంగా మారాయి. ప్రస్తుత ఫామ్ ఆధారంగా అశ్విన్ ఒక ప్రత్యామ్నాయ భారత జట్టును ఎంపిక చేశాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ యువ ఆటగాళ్లకు అద్భుతమైన వేదికగా మారింది. వెటరన్ ప్లేయర్లు తమ ముద్ర వేస్తుండగా, కుర్రాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో, కేవలం ఈ సీజన్ ప్రదర్శనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అశ్విన్ 15 మంది సభ్యులతో కూడిన ఒక బలమైన టీ20 జట్టును ఎంపిక చేశారు. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది.
ఆర్సీబీ ఆధిపత్యం.. చెన్నైకి నిరాశ
అశ్విన్ ఎంపిక చేసిన ఈ జట్టులో ఆశ్చర్యకరంగా బెంగళూరు జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే, అశ్విన్ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కేవలం ఒక్క ఆటగాడిని మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం. జట్ల వారీగా చూస్తే బెంగళూరు ఆటగాళ్లు ఈ సీజన్లో నిలకడగా రాణిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓపెనర్లుగా కుర్రాడు, అనుభవజ్ఞుడు
ఈ ప్రత్యామ్నాయ జట్టులో ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీని అశ్విన్ ఎంచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఈ సీజన్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో 40.40 సగటుతో, 237.64 భారీ స్ట్రైక్ రేట్తో 404 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కేఎల్ రాహుల్ ఫామ్..
మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న కేఎల్ రాహుల్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 11 మ్యాచ్లలో 46.80 సగటుతో 468 పరుగులు చేసిన రాహుల్, దాదాపు 180 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఈ ఇద్దరి కలయిక జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇస్తుందని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ యువ ప్రతిభావంతులు భారత టీ20 జట్టులో శాశ్వత స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..