
PBKS vs LSG Records: ముల్లన్పూర్ స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానల్లీ ఇన్నింగ్స్ను అద్భుతంగా నిర్మించారు. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ చరిత్రలో రెండో వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో ఆడమ్ గిల్క్రిస్ట్, షాన్ మార్ష్ నెలకొల్పిన 206 పరుగుల రికార్డు తర్వాత ఇది రెండో స్థానంలో నిలిచింది.
లక్నో బౌలర్లను లక్ష్యంగా చేసుకున్న ఈ జోడీ ముఖ్యంగా ఐడెన్ మార్క్రామ్ వేసిన ఒకే ఓవర్లో ఐదు భారీ సిక్సర్లు బాది 32 పరుగులు పిండుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చరిత్రలో ఒక బౌలర్ ఒకే ఓవర్లో ఇన్ని పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. గతంలో రవి బిష్ణోయ్ 27 పరుగులు ఇచ్చి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు మార్క్రామ్ ఆ అప్రతిష్టను తన మూటగట్టుకున్నాడు.
ఈ మ్యాచ్లో కూపర్ కానల్లీ తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. అతను 87 పరుగులతో వీరవిహారం చేసి, గతంలో పెర్త్ స్కార్చర్స్ తరపున చేసిన 77 పరుగుల రికార్డును అధిగమించాడు. దురదృష్టవశాత్తూ ఆర్య, కానల్లీ ఇద్దరూ తమ శతకాలను తృటిలో తప్పించుకున్నప్పటికీ, జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ టాప్-3 బ్యాటర్లు ఈ ఇన్నింగ్స్లో మొత్తం 16 సిక్సర్లు బాది, 2024లో కోల్కతాపై నెలకొల్పిన రికార్డును సమం చేశారు.
లక్నో జట్టుపై ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నెలకొల్పిన 167 పరుగుల రికార్డును ఆర్య-కానల్లీ జోడీ ఈరోజు తుడిచిపెట్టేసింది. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ధాటికి రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టు బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..