
T20 World Cup 2026: భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ 2026కు పాకిస్థాన్ జట్టు వస్తుందా రాదా? అనే సందిగ్ధత గత కొన్నాళ్లుగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాకు మద్దతుగా పాక్ జట్టు కూడా టోర్నీ నుంచి తప్పుకుంటుందని వార్తలు వినిపించాయి. అయితే, ఐసీసీ వార్నింగ్తో ఎట్టకేలకు పాక్ జట్టు తమ స్వ్కాడ్ను ప్రకటించింది. ఇక తాజాగా మరోసారి పాక్ జట్టు భారత్ జట్టుతో మ్యాచ్ ఆడకుండా బహిష్కరిస్తామంటూ ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ప్లేయర్ చికాగా పేరుగాంచిన కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈక్రమంలో కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ ఎప్పుడూ ఇలానే బెదిరిస్తుంది. మేం టోర్నీని బహిష్కరిస్తాం, భారత్తో మ్యాచ్ ఆడం’ అని బెదిరింపులు చేస్తుంది. అసలు పాక్ రాకపోతేనే మంచిది. పాక్ జట్టు రాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రపంచకప్ అద్భుతంగా ముందుకు వెళ్తుంది. పాక్ రాకపోతే ఐసీసీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు” అని తెలిపారు.
‘‘కివీస్ టీంతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు కేవలం 10 ఓవర్లలోనే 154 పరుగుల టార్గెట్ను ఛేజ్ చేసింది. అలాగే, అంతకుముందు 15. 2 ఓవర్లలోనే 209 పరుగులను ఛేజ్ చేసింది. ఇలాంటి బీభత్సమైన బ్యాటింగ్ చూసి ఎన్నో జట్లు భయపడుతున్నాయి. అందుకే బాబోయ్ మేం రాం మీరే ఆడుకోండి అంటాయంటూ” కామెంట్స్ చేశారు. పాక్ జట్టు ప్రపంచ కప్లో ఎంట్రీ ఇస్తే టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించేందుకు సిద్ధంగా ఉంటారు. టీమిండియా బ్యాటర్లు కొలంబోలో కొడితే బాల్ చెన్నైలో పడుతుంది. అందుకే పాక్ ప్రపంచ కప్లో ఆడకపోవడమే బెస్ట్” అంటూ చెప్పుకొచ్చాడు. ఏదో ఒక కారణం వెతుక్కుని ఆగిపోవడానికి చూస్తోంది. ఇప్పటికే టీమిండియా డేంజరస్ బ్యాటింగ్తో ప్రపంచంలోని అన్ని జట్లకు స్ట్రాంగ్గా హెచ్చరికలు పంపిందంటూ చెప్పుకొచ్చాడు.