AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Cricket: ఒకే దెబ్బకు ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లపై వేటు… ప్రపంచ రికార్డు సృష్టించిన పాకిస్థాన్

Pakistan Cricket: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడుగురు ఆటగాళ్లతో పాటు ఇద్దరు కోచ్‌లపై వేటు వేసింది. వరుస పరాజయాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్రంగా స్పందించారు. పీసీబీ తీరును తప్పుబడుతూ, క్రికెట్‌లోనే కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని సెటైర్ వేశారు.

Pakistan Cricket: ఒకే దెబ్బకు ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లపై వేటు... ప్రపంచ రికార్డు సృష్టించిన పాకిస్థాన్
Pakistan Cricket
Rakesh
|

Updated on: Sep 01, 2026 | 2:46 PM

Share

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత షాకింగ్ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లను స్వదేశానికి పంపిస్తూ, ఇద్దరు కోచ్‌లను తొలగించింది. ఈ పరిణామంపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ టెస్టు జట్టు ప్రదర్శన దారుణంగా తయారైంది. మొదటి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని సిరీస్‌ను 0-2 తేడాతో ముందస్తుగానే కోల్పోయింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న మూడో ఆఖరి టెస్టు మ్యాచ్‌కు ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఏడుగురు కీలక సభ్యులతో పాటు ఇద్దరు కోచ్‌లను అర్ధాంతరంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెట్ చరిత్రలోనే పర్యటన మధ్యలో ఇంత పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను ఇంటికి పంపడం ఎప్పుడూ జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రపంచ రికార్డు అంటూ రమీజ్ రాజా సెటైర్లు

పీసీబీ తీసుకున్న ఈ అకస్మాత్తు చర్యపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీబీసీ పాడ్‌కాస్ట్‌ ముఖాముఖిలో మాట్లాడుతూ పీసీబీ తీరును ఎద్దేవా చేశారు. క్రికెట్‌లో ఎక్కడా ఇలాంటి వింత నిర్ణయాలు ఉండవని, ఒకేసారి ఇంతమందిని పక్కన పెట్టి పాకిస్థాన్ కొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిందని కామెంట్ చేశాడు. బోర్డు ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం తగదని హితవు పలికారు.

ఫుట్‌బాల్ సంస్కృతిని క్రికెట్‌కు రుద్దడమేంటి?

పీసీబీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన రమీజ్ రాజా, ఇది క్రికెట్ బోర్డులా కాకుండా ఫుట్‌బాల్ క్లబ్‌లా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఫుట్‌బాల్ లీగ్‌లలో మధ్యలోనే మేనేజర్లను, ప్లేయర్లను మార్చినట్లుగా క్రికెట్‌లో చేయడం ఆట ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమని స్పష్టం చేశారు. మూడో టెస్టు ముగిసే వరకు కనీసం పది రోజుల పాటు ఓపిక పట్టకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు.

ఆ ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లు వీరే

మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే సీనియర్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ ఆగా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జాఫర్, ఖుర్రం షెహజాద్‌లను జట్టు నుంచి తొలగించారు. వేటు పడిన వారిలో కేవలం ఆటగాళ్లే కాకుండా టెస్టు జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ కూడా ఉండటం గమనార్హం. ఇంగ్లండ్ పర్యటనలో అవమానకర ఓటములతో కుదేలైన పాకిస్థాన్ క్రికెట్‌ను ఈ దారుణ నిర్ణయం మరింత గందరగోళంలోకి నెట్టివేసింది. రాబోయే మూడో టెస్టులో కొత్త ఆటగాళ్లతో పాక్ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us