
Pakistan Ball Tampering: క్రికెట్ చరిత్రలో ఆగస్టు 20వ తేదీకి ఒక నల్లటి అధ్యాయం ఉంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006లో ఇంగ్లాండ్తో జరిగిన ఓవల్ టెస్టులో పాకిస్థాన్ జట్టుపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు రావడం, దానికి నిరసనగా పాక్ జట్టు మైదానంలోకి రాకుండా మ్యాచ్ను బహిష్కరించడం తీవ్ర సంచలనం సృష్టించింది. 2006 ఆగస్టు 17న లండన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 173 పరుగులకే కుప్పకూల్చిన పాకిస్థాన్, తమ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 504 పరుగులు చేసి భారీ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసిన సమయంలో డ్రామా మొదలైంది. ఆట 56వ ఓవర్కు చేరుకోగానే పాక్ బౌలర్లు మహమ్మద్ ఆసిఫ్, ఉమర్ గుల్ వేస్తున్న బంతులు రివర్స్ స్వింగ్ కావడం గమనించిన అంపైర్లు, పాకిస్థాన్ జట్టు బంతి రూపకల్పనను దెబ్బతీసిందనే ఆరోపణతో బంతిని మార్చాలని నిర్ణయించారు.
అంపైర్ల నిర్ణయంతో అవమానంగా భావించిన పాక్
నాలుగో అంపైర్ ట్రెవర్ జెస్టీ కొత్త బంతుల పెట్టెను మైదానంలోకి తీసుకురావడం, అందులో నుంచి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒక బంతిని ఎంచుకోవడం వేగంగా జరిగిపోయాయి. తమపై అనవసరంగా బాల్ టాంపరింగ్ ఆరోపణ మోపారని భావించిన పాకిస్థాన్ జట్టు తీవ్ర మనస్తాపానికి గురైంది. వెలుతురు తగ్గడంతో టీ విరామం ప్రకటించగా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లారు. అంపైర్ల ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ, విరామం పూర్తయినా మైదానంలోకి ఆలస్యంగా వెళ్లాలని కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆధ్వర్యంలోని పాక్ జట్టు ప్రణాళిక రచించింది.
మైదానంలో వెయిటింగ్.. స్టంప్స్ తీసేసిన అంపైర్లు
టీ విరామం ముగిసిన తర్వాత అంపైర్లు మైదానంలోకి వచ్చి వేచి చూసినా పాకిస్థాన్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాలేదు. కెప్టెన్ ఇంజమామ్ గ్యాలరీ బాలకనీలోకి వచ్చి చూసినప్పటికీ ఆటగాళ్లను మైదానంలోకి పంపలేదు. కొంతసేపటి తర్వాత అంపైర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లు పాల్ కాలింగ్వుడ్, ఇయాన్ బెల్లతో కలిసి మళ్లీ మైదానంలోకి వచ్చారు. పాక్ జట్టు వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిబంధనల ప్రకారం అంపైర్లు బెయిల్స్ తొలగించి మ్యాచ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించి వెనుతిరిగారు.
చివరి క్షణంలో మైదానంలోకి వచ్చినా దక్కని ఫలితం
అంపైర్లు వెనుతిరిగిన తర్వాత పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఇంజమామ్ ఉల్ హక్ తన జట్టుతో కలిసి మైదానంలోకి వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అంపైర్లు మళ్లీ మైదానంలోకి రాలేదు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆ రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. ఐదో రోజు ఆటలో కూడా పాకిస్థాన్ వైఖరి కారణంగా మ్యాచ్ ఆడడానికి నిరాకరించినట్లు పరిగణించి, ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అలా పాకిస్థాన్ తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం విజయం సాధించాల్సిన మ్యాచ్ను చేజార్చడమే కాకుండా క్రికెట్ చరిత్రలోనే ఒక వివాదాస్పద ఘట్టంగా మిగిలిపోయింది.
ఎక్కువమంది చదివినది: SL vs IND: 7 ఇన్నింగ్స్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వేటుకు సిద్ధమైన గంభీర్?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..