
PAK vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా నేడు పల్లెకెలె వేదికగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి, ఇంగ్లండ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఉన్న పాక్ బ్యాటర్లు పోరాడగా, ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వారిని కట్టడి చేశారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కేవలం 45 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ (7) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ సల్మాన్ ఆగా (5) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25) కాసేపు క్రీజులో నిలబడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. చివర్లో షాదాబ్ ఖాన్ 23 పరుగులతో రాణించడంతో పాక్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లతో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ హ్యారీ బ్రూక్ మరియు జోస్ బట్లర్ ఉన్నారు. ఇంగ్లండ్ గెలిస్తే నేరుగా సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది, అదే పాకిస్థాన్ గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్-2 పాయింట్ల పట్టికపై భారీ ప్రభావాన్ని చూపనుంది. ఇంగ్లండ్ ఇప్పటికే శ్రీలంకపై గెలిచి 2 పాయింట్లతో ఉండగా, పాకిస్థాన్ ఖాతాలో కేవలం ఒకే ఒక పాయింట్ (న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దవ్వడం వల్ల) ఉంది. పల్లెకెలె పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో అదిల్ రషీద్, లియామ్ డాసన్ వంటి బౌలర్లు మ్యాచ్ను మలుపు తిప్పారు. ఇప్పుడు పాక్ బౌలర్లు షాహీన్, షాదాబ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..