T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024లో షాకింగ్ ఫలితాల కారణంగా రెండు పెద్ద జట్లైన శ్రీలంక, న్యూజిలాండ్ ప్రయాణం గ్రూప్ దశలోనే ముగిసింది. ఈ రెండు జట్లూ సూపర్-8కి అర్హత సాధించలేకపోయాయి. గ్రూప్ డీలో, శ్రీలంక, దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. అలాగే, నేపాల్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. గ్రూప్ సీలో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. దీంతో కివీస్ జట్టు గ్రూప్ దశ నుంచే పెవిలియన్కు చేరింది. పాకిస్థాన్కు కూడా ఇదే ముప్పు పొంచి ఉంది. ఒకవేళ అమెరికా, ఐర్లాండ్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. బాబర్ అజామ్ సారథ్యంలోని జట్టు కూడా టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్ అవుతుంది. శ్రీలంకను పక్కన పెడితే, ఇది న్యూజిలాండ్, పాకిస్తాన్లకు డబుల్ దెబ్బ కావొచ్చని తెలుస్తోంది. ఒకటి, 2024 టీ20 ప్రపంచకప్లో టైటిల్ రేసు నుంచి నిష్క్రమించడం. రెండవది, 2026లో భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టోర్నీకి నేరుగా అర్హత సాధించడంలో వైఫల్యం. ఒకే దెబ్బకు రెండు షాక్లు తగిలాయి.
ఈసారి మాదిరిగానే, తదుపరి టీ20 ప్రపంచకప్లో 20 జట్లు ఆడనున్నాయి. వాటిలో 12 జట్లు నేరుగా చోటు దక్కించుకుంటాయి. ఐసీసీ ప్రస్తుత టోర్నమెంట్ను 2026 టీ20 ప్రపంచకప్నకు ప్రాతిపదికగా పరిగణించింది. దీని కింద సూపర్-8కి వెళ్లే ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలు కాబట్టి ఈ రెండు జట్లు కూడా భాగమవుతాయి. మిగిలిన రెండు స్థానాలను ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయించనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయం జూన్ 30, 2024న తీసుకోనున్నారు. శ్రీలంక సూపర్-8కి చేరుకోలేకపోయింది. కానీ, సహ-హోస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు ర్యాంకింగ్పై న్యూజిలాండ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ అర్హత సాధించలేకపోతే, అది కూడా ర్యాంకింగ్పై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ జట్లకు మంచి విషయం ఏమిటంటే, ఆ రెండు జట్లు ర్యాంకింగ్లో మెరుగ్గా ఉంటే, వారు తదుపరి ఎడిషన్కు నేరుగా అర్హత సాధించే వీలుంటుంది.
2026 టీ20 ప్రపంచకప్లో మిగిలిన ఎనిమిది స్థానాలు ప్రాంతీయ క్వాలిఫైయర్ల ద్వారా భర్తీ చేయనున్నారు. కెనడా, జింబాబ్వే, నమీబియా, నేపాల్, పపువా న్యూ గినియా, ఉగాండా, ఒమన్, ఐర్లాండ్ జట్లు తదుపరి టీ20 ప్రపంచకప్ ఆడాలంటే క్వాలిఫికేషన్ టోర్నీలో తప్పక గెలవాలని ప్రస్తుతానికి నిర్ణయించారు. ఈ జట్లంతా 2024 టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశకు చేరుకోలేకపోయాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..