IND vs PAK : మ్యాచ్ ముగియకముందే తట్టబుట్ట సర్దుకుని నఖ్వీ పరార్..సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్

IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన విజయపరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. కొలంబో వేదికగా జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో టీమిండియా మరోసారి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఊహించిన దానికంటే వన్‎సైడ్‎గా సాగిన ఈ మ్యాచ్‌లో 61 పరుగుల భారీ తేడాతో పాక్‌ను ఓడించి, సూర్యకుమార్ యాదవ్ సేన దాయాదిపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

IND vs PAK : మ్యాచ్ ముగియకముందే తట్టబుట్ట సర్దుకుని నఖ్వీ పరార్..సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్
Mohsin Naqvi

Updated on: Feb 16, 2026 | 7:41 AM

IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన విజయపరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. కొలంబో వేదికగా జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో టీమిండియా మరోసారి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఊహించిన దానికంటే వన్‎సైడ్‎గా సాగిన ఈ మ్యాచ్‌లో 61 పరుగుల భారీ తేడాతో పాక్‌ను ఓడించి, సూర్యకుమార్ యాదవ్ సేన దాయాదిపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి తాళలేక కేవలం 114 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ గెలుపుతో వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 8-1కి చేరింది. అంటే తొమ్మిది సార్లు తలపడితే ఎనిమిది సార్లు పాక్‌ను భారత్ మట్టికరిపించిందన్నమాట.

ఈ మ్యాచ్‌ కంటే ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగారు. అయితే ఐసీసీ గట్టిగా హెచ్చరించడంతో తోకముడిచిన పాక్.. చివరి నిమిషంలో ఆడేందుకు ఒప్పుకుంది. తీరా మ్యాచ్ మొదలయ్యాక సీన్ రివర్స్ అయింది. భారత్ ఆడుతుంటే పాక్ ఆటగాళ్లు ప్రేక్షకులుగా మిగిలిపోయారు. తన జట్టు గెలిస్తే క్రెడిట్ కొట్టేద్దామని స్టేడియానికి వచ్చిన నఖ్వీకి.. భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ ఇంకా పూర్తి కాకముందే, పాక్ ఓటమి ఖరారు కావడంతో ఆయన సైలెంట్‌గా స్టేడియం నుంచి జారిపోయారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇస్లామాబాద్‌ వెళ్లిపోయారు అంటూ నెటిజన్లు నఖ్వీపై సెటైర్లు వేస్తున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఈ స్కోరును కాపాడుకోవడంలో భారత బౌలర్లు విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా సంధించిన యార్కర్లకు పాక్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. మరోవైపు హార్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రతిభతో పాక్ నడ్డి విరిచాడు. వరుస వికెట్లతో పాకిస్థాన్ పతనం ఒకానొక దశలో పేకమేడను తలపించింది. స్టేడియంలో ఉన్న పాక్ అభిమానులు కూడా తమ జట్టు ఆటతీరు చూసి తలలు పట్టుకున్నారు. కనీసం గట్టిపోటీ ఇస్తారని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెళ్లగక్కారు. “టీమిండియా చేతిలో ఓడిపోవడం మాకు రొటీన్ అయిపోయింది” అంటూ కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు స్టేడియం బయట మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు అసమర్థతను ఎండగట్టారు. “బుమ్రా, హార్దిక్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొనే సత్తా మా బ్యాటర్లకు లేదు. భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మమ్మల్ని అధిగమించింది. ఈ విషయాన్ని మేము అంగీకరిస్తాం” అని ఒక పాక్ అభిమాని నిష్కర్షగా చెప్పడం గమనార్హం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..