
Hardik Pandya Injury Update: ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. లక్నో జట్టుతో జరిగిన గత మ్యాచ్కు కూడా ఆయన అందుబాటులో లేడు. తాజా సమాచారం ప్రకారం, హార్దిక్ పాండ్యా గాయం ఇంకా నయం కాకపోవడంతో తదుపరి మ్యాచ్కు కూడా దూరం కానున్నాడు. జట్టుతో కలిసి ఆయన ప్రయాణించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. రాయ్పూర్లో జరగబోయే కీలక పోరులో హార్దిక్ ఆడకపోవడం జట్టుకు పెద్ద లోటుగానే చెప్పవచ్చు.
హార్దిక్ లేని సమయంలో జట్టును నడిపించిన సూర్యకుమార్ యాదవ్ కూడా తదుపరి మ్యాచ్లో ఆడే అవకాశం కనిపించడం లేదు. సూర్యకుమార్ భార్య దేవిషా శెట్టి త్వరలో తల్లి కాబోతోంది. ఈ సంతోషకరమైన సమయంలో తన కుటుంబంతో గడపాలని సూర్య నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కారణంతోనే మే 10న బెంగళూరుతో జరిగే మ్యాచ్కు ఆయన అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. అయితే దీనిపై జట్టు యాజమాన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ అందుబాటులో లేని పక్షంలో, జట్టు బాధ్యతలను ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐదుసార్లు జట్టుకు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ వైపు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన తరుణంలో, అనుభవజ్ఞుడైన రోహిత్ అయితే జట్టును గాడిలో పెడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ రోహిత్ సిద్ధంగా లేకపోతే, యువ ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం ఇచ్చే ఆలోచన కూడా ఉంది.
ప్రస్తుత సీజన్లో ముంబై ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా ఉంది. దీనికి తోడు జట్టులోని సీనియర్ ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం సజావుగా లేదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాయ్పూర్ వేదికగా బెంగళూరుతో జరగనున్న మ్యాచ్ ముంబై ఆత్మగౌరవానికి పరీక్షగా మారింది. కొత్త సారథి నాయకత్వంలోనైనా జట్టు మళ్ళీ విజయాల బాట పడుతుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..