
Mohammed Siraj Wild Throw: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు గాలే అంతర్జాతీయ మైదానంలో తొలి టెస్టు ఆడుతోంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. టెస్టు ఫార్మాట్లో ప్రతి పరుగూ ఎంతో విలువైనది. ఫీల్డింగ్ చేసే జట్టు ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ఎప్పుడూ ఒత్తిడి పెంచుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ ఆడుతుండగా, 69వ ఓవర్ను స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ మొదటి బంతిని క్రీజులో ఉన్న బ్యాటర్ సోనాల్ దినూష తెలివిగా రివర్స్ స్వీప్ ఆడాడు. బంతి వేగంగా డీప్ పాయింట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్ వెంటనే అప్రమత్తమై బంతిని అందుకున్నాడు. బ్యాటర్లు అప్పటికే వేగంగా 2 పరుగులు పూర్తి చేసేందుకు పిచ్ పై పరుగెత్తుతుండటంతో, సిరాజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు అత్యంత బలంగా విసిరాడు. ఆ త్రో స్పీడ్ ఎంతలా ఉందంటే గ్రౌండ్లో ఉన్న ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు.
సిరాజ్ విసిరిన ఆ రాకెట్ త్రో నేరుగా లెగ్ అంపైర్ స్థానంలో నిల్చున్న పాకిస్థాన్ అంపైర్ ఎహ్సాన్ రజా వైపు వెళ్ళింది. బంతి గాల్లో తన తల వైపు దూసుకురావడాన్ని గమనించిన రజా అద్భుతమైన రిఫ్లెక్సెస్ చూపించాడు. ఏమాత్రం ఆలోచించకుండా తల దించుకుని ఒక్కసారిగా కిందకు వంగాడు. బంతి ఆయన తల పైభాగం నుంచి క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా వెళ్ళిపోయింది. ఒకవేళ రజా సెకను వ్యవధి ఆలస్యం చేసినా, ఆ బలమైన త్రో నేరుగా ఆయన తలకు బలంగా తాకేది.
ఈ ఊహించని పరిణామాన్ని చూసి బౌలింగ్ ఎండ్లో ఉన్న జడేజాతో పాటు ఫీల్డింగ్ చేస్తున్న భారత ఆటగాళ్లందరు ఓ క్షణం అలాగే ఉందిపోయారు. సిరాజ్ సైతం తాను విసిరిన త్రో అంపైర్ వైపు వెళ్లడం చూసి టెన్షన్ పడ్డాడు. అంపైర్ రజా సురక్షితంగా బయటపడటంతో మైదానంలో ఉన్న వారంతా ఒక్కసారిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.