Team India: ‘షమీకి ఇదే చివరి ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే, అక్కడ రాణించాల్సిందే.. లేదంటే’

IPL 2022: మహ్మద్ షమీ IPL 2022లో తనను తాను నిరూపించుకునే అవకాశం ఉంది. అతను బాగా రాణిస్తేనే T20 ప్రపంచ కప్ జట్టులో ఎంపిక కాగలడు.

Team India: షమీకి ఇదే చివరి ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే, అక్కడ రాణించాల్సిందే.. లేదంటే
Mohammed Shami

Updated on: Mar 18, 2022 | 1:35 PM

మహ్మద్ షమీ ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అతని బౌలింగ్ స్కిల్స్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తాడు. బహుశా ప్రపంచంలో ఏ బౌలర్‌కు ఇలాంటి నైపుణ్యం లేదనిపిస్తోంది. అయినా, మహ్మద్ షమీ(Mohammed Shami) టీ20 ప్రపంచ కప్ 2022(T20 World Cup 2022) ఆడటంపై సందిగ్ధం నెలకొంది. నిజానికి, మహమ్మద్ షమీ ప్రస్తుతం టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు. T20, ODI క్రికెట్‌లో అనేక ఎంపికల కారణంగా, షమీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆడటం కష్టంగా మారింది. మీడియా నివేదికల ప్రకారం, ప్రస్తుతం వన్డే, టీ20 క్రికెట్‌లో మహమ్మద్ షమీకి టీమిండియా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. టీ 20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా తరపున వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఎంపిక చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో రాబోయే ఐపీఎల్ 2022(IPL 2022)లో సత్తా చాటితేనే పొట్టి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకుంటాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, మహ్మద్ షమీ టీ20 ప్రపంచకప్‌లో జట్టులో చోటు సంపాదించాలంటే, అతను ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. బీసీసీఐ వర్గాల మేరకు, “జస్ప్రీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలో సరిపోయే ఏకైక బౌలర్. అయితే మిగతా బౌలర్లు మాత్రం ఏదో ఒక ఫార్మాట్‌లో మాత్రమే ఆకట్టుకుంటున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆటగాళ్లకు స్పష్టంగా ఇదే చెబుతుంది’ అని తెలుస్తోంది.

ఐపీఎల్ 2022 చివరి అవకాశం..

మహ్మద్ షమీ గత 9 ఏళ్లలో కేవలం 17 T20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 9.54 పరుగులుగా నిలిచింది. అతను ఐపీఎల్‌లో కూడా చాలా ఖరీదైనవాడిగా మారాడు. కాబట్టి షమీ T20 క్రికెట్‌లో టీమిండియాకు తొలి ఎంపిక మాత్రం కాదు. బీసీసీఐ వర్గాల మేరకు, ‘ఐపీఎల్ 2022 వారికి ట్రయల్స్ లాంటిది. ఇక్కడ మంచి ప్రదర్శన చేసిన వారికే T20 ప్రపంచ కప్‌లో చోటు దక్కుతుంది. దీన్ని అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

టీమిండియా ఎలాంటి వారికోసం చూస్తోందంటే..

నిజానికి టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో సహా దోహదపడే ఆటగాళ్లను టీమిండియా కోరుకుంటుంది. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ రాకతో ఈ విషయం మరింత బలపడింది. ఇది కాకుండా, జట్టులో బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ కృష్ణ వంటి ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ కూడా జట్టులో ఉన్నారు. ఈ బౌలర్లను T20, ODI ఫార్మాట్ స్పెషలిస్ట్‌లుగా పరిగణిస్తారు. వారు తమను తాము నిరూపించుకున్నారు. వీరితో పాటు, హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్ కూడా బంతి, బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. ఐపీఎల్ 2022 ఈ ఇద్దరు ఆటగాళ్లకు పెద్ద పరీక్ష కానుంది. అలాగే సెలెక్టర్లు రాహుల్ చాహర్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Also Read: IPL 2022: స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ ఖాన్ నిషేధం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే..

Team India: కెరీర్ చివరి వన్డేలో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. విరాట్‌తో కలిసి పాకిస్తాన్‌ తాటతీసిన భారత దిగ్గజం