IPL 2026: బెంగళూరు స్టేడియంలో కలకలం.. మరోసారి నిషేధం విధిస్తారా..?

Chinnaswamy Stadium CCTV Issue: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపాలు తలెత్తాయన్న వార్తలు ఐపిఎల్ అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో సిసిటివి కెమెరాలు పనిచేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎట్టకేలకు స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించింది.

IPL 2026: బెంగళూరు స్టేడియంలో కలకలం.. మరోసారి నిషేధం విధిస్తారా..?
Rcb Vs Mi Ipl 2026

Updated on: Apr 29, 2026 | 3:01 PM

Karnataka State Cricket Association News: బెంగళూరు జట్టు తన సొంత మైదానంలో ఆడిన చివరి మ్యాచ్ తర్వాత ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. స్టేడియంలోని సుమారు 240కి పైగా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తనిఖీల్లో తేలడంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా స్టేడియం ప్రవేశ ద్వారాలు, కార్పొరేట్ స్టాండ్‌లు, ప్రేక్షకులు తిరిగే ప్రధాన ప్రాంతాల్లో కెమెరాలు మొరాయించడం భద్రతా పరమైన ఆందోళనలకు దారితీసింది.

పోలీసుల విచారణలో వెలుగులోకి దిగ్భ్రాంతికర విషయాలు..

ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు, అనుమతి లేని పాత కార్డులను ఉపయోగించి సర్వర్ గదిలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వారు అక్కడి పరికరాలను దెబ్బతీశారని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్లారిటీ ఇచ్చిన క్రికెట్ అసోసియేషన్..

ఈ ఘటనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పనిచేయకుండా పోయిన కెమెరాలు స్టేడియం ప్రధాన భద్రతా వ్యవస్థకు చెందినవి కావని సంస్థ స్పష్టం చేసింది. అవి ప్రైవేట్ సంస్థలు తమ అంతర్గత అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నవని, పోలీసుల నిఘా వ్యవస్థకు దీనితో సంబంధం లేదని వివరించింది.

మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ సమస్యను గుర్తించి పరిష్కరించామని, క్రీడాకారులకు లేదా ప్రేక్షకులకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదని అసోసియేషన్ ధీమా వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ అంతర్గత వ్యవహారమని, ఎటువంటి కుట్ర కోణం లేదని పేర్కొంది.

భద్రతపై ఎందుకు ఇంత చర్చ?

గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, చిన్నస్వామి స్టేడియంలో భద్రతను అత్యంత కఠినతరం చేశారు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజా ఘటన స్టేడియంపై నిషేధం విధిస్తారేమో అన్న భయాన్ని కలిగించింది. అందుకే క్రికెట్ అసోసియేషన్ వేగంగా స్పందించి ప్రజలకు, అభిమానులకు భరోసా కల్పించింది.

మైదానంలో బెంగళూరు జోరు..

ఒకవైపు వివాదాలు నడుస్తున్నా, మైదానంలో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్‌లో తమ సొంత మైదానంలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిని గెలుచుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై జరగబోయే మ్యాచ్‌లను ఈ జట్టు రాయ్‌పూర్‌లో ఆడనుంది. స్టేడియం భద్రతపై నెలకొన్న నీలినీడలు తొలగిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us