T20 World Cup 2026 : వినాశకాలే విపరీత బుద్ధి..భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్

T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ తీసుకున్న మొండి నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం, 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ నిప్పులు చెరిగారు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల నష్టపోయేది భారత్ కాదు, పాకిస్థానేనని ఆయన హెచ్చరించారు.

T20 World Cup 2026 : వినాశకాలే విపరీత బుద్ధి..భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
Kapil Dev On Pakistan

Updated on: Feb 03, 2026 | 7:59 PM

T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ తీసుకున్న మొండి నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం, 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ నిప్పులు చెరిగారు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల నష్టపోయేది భారత్ కాదు, పాకిస్థానేనని ఆయన హెచ్చరించారు. ఈ నిర్ణయం పాక్ క్రికెటర్ల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ – పాక్ మ్యాచ్‌పై జరుగుతున్న రచ్చపై కపిల్ దేవ్ ఘాటుగా స్పందించారు. “మీరు కేవలం ఒక మ్యాచ్‌ను బహిష్కరించడం లేదు, పాకిస్థాన్ క్రికెటర్ల మొత్తం ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు” అని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్‌లో అద్భుతమైన టాలెంట్ ఉందని, కానీ బోర్డు తీసుకునే ఇలాంటి రాజకీయ నిర్ణయాల వల్ల యువ ఆటగాళ్ల కెరీర్లు బుడగలా పేలిపోతాయని కపిల్ అన్నారు. రాజకీయాలు, ఈగోల కోసం క్రీడలను బలి చేయడం ఏమాత్రం తగదని సూచించారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుబడుతూ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఒక వ్యక్తి అహంకారం దేశం కంటే లేదా ఆట కంటే పెద్దది కాకూడదు. ఆటగాళ్లకు ఆడటం ఇష్టం లేకపోతే వారు నేరుగా చెప్పాలి, అంతే కానీ బోర్డు ఒత్తిడితో ఆడబోమని చెప్పడం దేశ ప్రతిష్టను దిగజార్చడమే” అని పేర్కొన్నారు. పాక్ ఆటగాళ్లు తమ గళాన్ని వినిపించాలని, బోర్డు నిర్ణయాలకు బలి కావొద్దని ఆయన కోరారు.

ఒకవేళ పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే, ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కపిల్ హెచ్చరించారు. “దీర్ఘకాలంలో పాకిస్థాన్‌ను ఎవరూ మిస్ అవ్వరు. అభిమానులు వేరే మ్యాచ్‌లను చూస్తారు, ప్రపంచం ముందుకు సాగిపోతుంది. కానీ పాకిస్థాన్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకాకిగా మిగిలిపోతుంది” అని ఆయన విశ్లేషించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ జోక్యం ఉంటే సభ్యత్వం రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని గుర్తు చేశారు.

బంగ్లాదేశ్ జట్టు తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని కోరినప్పుడు ఐసీసీ తిరస్కరించింది. దీనికి నిరసనగా పాక్ ప్రభుత్వం తమ జట్టు భారత్‌తో ఆడదని ప్రకటించింది. అయితే, ఇప్పటికే భారత్-పాక్ మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతున్నప్పుడు, పాక్ బహిష్కరించడం వెనుక ఎలాంటి తర్కం లేదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం పాక్ యువ క్రికెటర్ల కలలను సమాధి చేయడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి