
Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ క్రికెట్ వేదికగా భారత క్రికెట్ జట్టు (Team India) తో చారిత్రక పోరుకు సిద్ధమవుతున్న వేళ జపాన్ క్రికెట్ జట్టు (Japan Cricket Team) సారథి కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (Kendel Kadowaki-Fleming) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సెప్టెంబర్ 22న ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. దూకుడైన ఆటతీరుతో అండర్-19 స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికపై పలు రికార్డులు నెలకొల్పిన 15 ఏళ్ల లెఫ్టార్మ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అతడిని నిలువరించడం తమకు పెద్ద సవాల్ కాదని జపాన్ కెప్టెన్ పేర్కొన్నారు. గతంలో అండర్-19 ఆసియా కప్ (Asia Cup) పోరులో తమ 17 ఏళ్ల యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ చార్లీ హరా-హింజ్ (Charlie Hara-Hinze) బౌలింగ్లో వైభవ్ ఔటైన విషయాన్ని గుర్తు చేస్తూ, అతడిని పెవిలియన్ పంపేందుకు సరైన ప్రణాళిక ఉందని వెల్లడించారు.
ఈ మ్యాచ్ కోసం మైదానంలో ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నట్లు కెండెల్ వివరించారు. సాధారణంగా అక్కడ ఉన్న రెండు స్టాండ్స్లో సుమారు 500 మంది మాత్రమే కూర్చునే వెసులుబాటు ఉంటుంది. ఈ అరుదైన మ్యాచ్ను తిలకించడానికి సుమారు 2,000 మొదలుకుని 3,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో తాత్కాలిక స్టాండ్స్ను ఏర్పాటు చేస్తున్నారు.
టోక్యో సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి భారత అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతతో పాటు రవాణా ఏర్పాట్లను మునుపెన్నడూ లేని రీతిలో కట్టుదిట్టం చేస్తున్నారు. భారత స్టార్ ఆటగాళ్లతో తమ జట్టు తలపడటం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తోందని, ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, అది ముగిసిన వెంటనే ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) నిమిత్తం జపాన్ పర్యటనకు వెళ్లనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..