MS Dhoni : ధోనీ మిస్సింగ్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా? సీఎస్కేకు కావాలనే దూరంగా ఉంటున్నారా?

MS Dhoni : సీఎస్కే నుంచి ధోనీ కావాలనే దూరంగా ఉంటున్నారని న్యూజిలాండ్ మాజీ స్టార్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త నాయకత్వానికి స్వేచ్ఛనిచ్చేందుకే ధోనీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధోనీ లేని లోటును ఏమాత్రం తెలియనీయకుండా సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు.

MS Dhoni : ధోనీ మిస్సింగ్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా? సీఎస్కేకు కావాలనే దూరంగా ఉంటున్నారా?
Csk Ipl 2026 Ms Dhoni

Updated on: Apr 24, 2026 | 11:17 AM

MS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒకవైపు ఆనందం, మరోవైపు ఆందోళన కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన జోష్‌లో ఉన్న సీఎస్కే ఫ్యాన్స్‌కు, ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ధోనీ కేవలం గాయం వల్ల మాత్రమే కాకుండా, కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నారంటూ న్యూజిలాండ్ మాజీ స్టార్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సైమన్ డౌల్ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2026లో ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పిక్క గాయం కారణంగా ఆయన కోలుకుంటున్నారని అందరూ భావిస్తున్నారు. అయితే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ధోనీ మైదానానికి రాకపోవడంపై సైమన్ డౌల్ స్పందించారు. “ధోనీ చాలా తెలివిగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆయన కేవలం గాయం వల్లే కాదు, కావాలనే వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. కొత్త నాయకత్వం తన సొంత నిర్ణయాలు తీసుకునేలా, ధోనీ నీడ వారిపై పడకుండా ఉండేలా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది” అని క్రిక్‌బజ్ చర్చలో డౌల్ పేర్కొన్నారు.

ధోనీ వంటి దిగ్గజం డగౌట్‌లో ఉంటే కెమెరా ఫోకస్ అంతా ఆయనపైనే ఉంటుంది, దీనివల్ల మైదానంలో ఉన్న కెప్టెన్ ఇబ్బంది పడే అవకాశం ఉందని డౌల్ అభిప్రాయపడ్డారు. జట్టు ఒక రూత్ లెస్ మెషీన్‌లా తయారు కావాలని, ఎవరి మీదా ఆధారపడకుండా గెలవాలని ధోనీ కోరుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. ముంబైతో మ్యాచ్‌కు ముందు ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినా, వాంఖడే స్టేడియానికి మాత్రం ప్రయాణించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

ధోనీ లేకపోయినా దుమ్మురేపిన సీఎస్కే

ధోనీ లేని లోటును ఏమాత్రం తెలియనీయకుండా సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శాంసన్ బ్యాటింగ్ మెరుపులతో సీఎస్కే 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లో అకీల్ హొస్సేన్ 4 వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను 104 పరుగులకే చుట్టేశారు. వాంఖడే స్టేడియంలో ముంబైకి ఇది అత్యంత భారీ ఓటమి కాగా, సీఎస్కేకు ఇది చారిత్రాత్మక విజయం.

అభిమానుల నిరీక్షణ

ధోనీ వయస్సు ప్రస్తుతం 44 ఏళ్లు. కెరీర్ చివరి దశలో ఉన్న ఆయన, జట్టు భవిష్యత్తు కోసం గ్రౌండ్ కు దూరంగా ఉండి మార్గనిర్దేశం చేస్తున్నారని కొందరు ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. అయితే, ఆయన బ్యాటింగ్‌ను చూడటానికి వేచి చూస్తున్న లక్షలాది మంది అభిమానులకు మాత్రం ఈ గైర్హాజరీ నిరాశ కలిగిస్తోంది. తదుపరి మ్యాచ్‌లలోనైనా ధోనీ మైదానంలో కనిపిస్తారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Follow Us