IPL 2027: ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా 62మందిపై వేటుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు.. లిస్ట్‌లో ఆరుగురు తోపులు?

IPL 2027 Retentions: ఐపీఎల్ అంటేనే వ్యాపారంతో కూడిన క్రికెట్. ఇక్కడ ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా ఫామ్, ఫిట్‌నెస్ నిరూపించుకోకపోతే ఫ్రాంచైజీలు కనికరం చూపవు. ఐపీఎల్ 2027 వేలానికి ముందే దాదాపు 62 మంది ఆటగాళ్లు లీగ్ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న వార్త ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

IPL 2027: ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా 62మందిపై వేటుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు.. లిస్ట్‌లో ఆరుగురు తోపులు?
Ipl 2027 Retentions

Updated on: Jun 06, 2026 | 11:01 AM

IPL 2027 Retentions: ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో క్రికెట్ అభిమానుల కళ్లు అప్పుడే తదుపరి సీజన్‌పై పడ్డాయి. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ 2027 వేలానికి ముందే కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ ధర పలికి ఆశించిన స్థాయిలో రాణించని ప్లేయర్లు, తరచూ గాయాల బారిన పడే స్టార్లపై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్‌కు భారంగా మారిన హార్దిక్, బౌల్ట్?

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించని హార్దిక్ పాండ్యా (16.35 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (12.5 కోట్లు)లను వారి భారీ ధరల కారణంగా ఫ్రాంచైజీ విడుదల చేసే యోచనలో ఉంది. వీరు మాత్రమే కాకుండా, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, శార్దూల్ ఠాకూర్‌లను కూడా జట్టు నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలగే, రోహిత్ శర్మపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఏడాది భారీగానే ప్రక్షాళన జరిగేటట్లు ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ సంచలనం.. రుతురాజ్ అవుట్?

ఐపీఎల్ 2026లో ఆశించిన మేర మెరవలేకపోయిన కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతోంది. ఆశ్చర్యకరంగా, భారీ ధర కలిగిన రుతురాజ్ గైక్వాడ్ (18 కోట్లు), ప్రశాంత్ వీర్ (14.20 కోట్లు)లను వేలానికి వదిలేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే విదేశీ ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్ వంటి ఫ్లాప్ ప్లేయర్లతో పాటు, గాయాల సమస్యలతో సతమతమవుతున్న జేమీ ఓవర్టన్‌కు కూడా సీఎస్కే గుడ్ బై చెప్పేలా ఉంది.

లక్నోలో పంత్, పూరన్‌ల భారీ ధరపై వేటు!

గత సీజన్‌లో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జాయింట్స్ జట్టు ఈసారి సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. రికార్డు ధర పలికిన రిషభ్ పంత్ (27 కోట్లు), నికోలస్ పూరన్ (21 కోట్లు) తమ ధరలకు న్యాయం చేయలేకపోయారనే భావనలో యాజమాన్యం ఉంది. దీంతో వీరిని రిలీజ్ చేసి కొత్త వ్యూహాలతో వేలానికి వెళ్లాలని చూస్తోంది. ఇదే సమయంలో స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్ వంటి నిరంతరం గాయపడే బౌలర్లను కూడా లక్నో వదులుకునే ఛాన్స్ ఉంది.

కోల్‌కతా, హైదరాబాద్ జట్లలోనూ మార్పుల చేర్పులు..

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మినహా మిగిలిన అన్ని జట్లు భారీ మార్పులకే మొగ్గు చూపుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ స్టార్ ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ (25.20 కోట్లు), అజింక్యా రహానేలను పక్కన పెట్టేలా ఉంది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం లియామ్ లివింగ్‌స్టోన్ (13 కోట్లు), హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లను వదిలించుకుని పర్స్ బ్యాలెన్స్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us