
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ఒక 14 ఏళ్ల కుర్రాడు హాట్ టాపిక్గా మారాడు. అతనే టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం వైభవ్ సూర్యవంశీ. అతి చిన్న వయసులోనే కళ్లు చెదిరే బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన ఈ వండర్ కిడ్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వైభవ్ను మీడియా వెలుగులకు, సోషల్ మీడియా హడావుడికి దూరంగా ఉంచాలని నిర్ణయించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్వయంగా చిన్న వయసులోనే ఐపీఎల్లోకి వచ్చి ఎన్నో విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు. అందుకే, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి ఇబ్బందులు పడకూడదని పరాగ్ భావిస్తున్నాడు. అతి చిన్న వయసులో వచ్చే పాపులారిటీ వల్ల ఆటగాడి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని, అందుకే వైభవ్ను అధికారిక ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉంచాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. సోషల్ మీడియాలో వచ్చే పొగడ్తలు, విమర్శలు అతనిపై ప్రభావం చూపకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అరంగేట్రంలోనే అద్భుత రికార్డు
వైభవ్ సూర్యవంశీ గత సీజన్లోనే తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. ఏప్రిల్ 19, 2025న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసి, చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే, తన ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న మొట్టమొదటి బంతినే సిక్సర్గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుతమైన ఆరంభం అతన్ని రాత్రికి రాత్రే స్టార్ను చేసింది.
అండర్-19 వరల్డ్ కప్లో విధ్వంసం
వైభవ్ ఫామ్ కేవలం ఐపీఎల్కు మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవలే జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అతను విశ్వరూపం చూపించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో సెలక్టర్ల దృష్టిలో పడటమే కాకుండా, భారత క్రికెట్లో తదుపరి సూపర్ స్టార్ దొరికాడనే నమ్మకాన్ని కలిగించాడు.
సీనియర్ల హెచ్చరిక.. రెండో సీజన్ సవాల్
మాజీ టీమిండియా బౌలర్ లక్ష్మీపతి బాలాజీ మాత్రం వైభవ్కు ఒక హెచ్చరిక జారీ చేశారు. మొదటి సీజన్లో గుర్తుపట్టని ప్రత్యర్థులు, రెండో సీజన్ నాటికి అతని బలహీనతలపై రీసెర్చ్ చేసి వస్తారని బాలాజీ తెలిపారు. ఇలాంటి సమయంలో కుమార సంగక్కర వంటి దిగ్గజాల మార్గదర్శకత్వం వైభవ్కు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికతతో పాటు మానసిక దృఢత్వం కూడా ఈ సీజన్లో అతనికి పరీక్షగా మారనుంది.
క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్
రాజస్థాన్ రాయల్స్ ఈసారి వైభవ్ను యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా పంపాలని యోచిస్తోంది. అనుభవం ఉన్న జైస్వాల్ పక్కన ఉంటే వైభవ్పై ఒత్తిడి తగ్గుతుందని టీమ్ ప్లాన్. వైభవ్ కూడా తన లక్ష్యాలను చాలా స్పష్టంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్లో క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేయడమే తన లక్ష్యమని అతను ఇప్పటికే ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026లో ఈ వండర్ కిడ్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..