
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ సమరం మొదలుకానుంది. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచుల తర్వాత మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచులకు వర్షం ముప్పు పొంచి ఉంటే విజేతను ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐసీసీ టోర్నీల్లాగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ అన్నింటికీ రిజర్వ్ డేలు ఉండవు. మరి వాన పడితే ఏ జట్టు ఫైనల్కు వెళ్తుంది? ఏ జట్టు ఇంటికి వెళ్తుంది? బీసీసీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్ 2026లో క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచులకు ఎటువంటి రిజర్వ్ డే లేదు. కేవలం మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించారు. అంటే మొదటి మూడు ప్లేఆఫ్ మ్యాచులు వర్షం వల్ల ఆగిపోతే, అదే రోజు ఫలితాన్ని తేల్చాల్సి ఉంటుంది. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే, కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్లు ప్రయత్నిస్తారు. ఇందుకోసం సాధారణ సమయం కంటే అదనంగా 120 నిమిషాల (2 గంటలు) సమయాన్ని కేటాయిస్తారు.
అసలు మ్యాచ్ జరగకపోతే విజేత ఎవరు?
ఒకవేళ భారీ వర్షం వల్ల కనీసం 5 ఓవర్ల మ్యాచ్ లేదా కనీసం ఒక్క ఓవర్ (సూపర్ ఓవర్) నిర్వహించే అవకాశం కూడా లేకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి సమయంలో పాయింట్స్ టేబుల్ కీలకంగా మారుతుంది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ఏ జట్టు అయితే మెరుగైన స్థానంలో ఉంటుందో ఆ జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు క్వాలిఫైయర్-1 లో తలపడే రెండు జట్లలో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు ప్రాధాన్యత లభిస్తుంది.
ఎలిమినేటర్ రూల్ ఇంకా కఠినం
ఈ నిబంధన ఎలిమినేటర్ ఆడే జట్లకు ఆందోళన కలిగించే విషయమే. పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్లో తలపడతాయి. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, 3వ స్థానంలో ఉన్న జట్టు నేరుగా క్వాలిఫైయర్-2కు వెళ్తుంది. 4వ స్థానంలో ఉన్న జట్టు మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అందుకే ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా, పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లో ఉండటం జట్లకు చాలా ముఖ్యం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..