
ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు వేళ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక ఆసక్తికర చర్చకు తెరలేపారు. కోల్కతాపై ఘన విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆయన, ప్లేఆఫ్స్ చేరిన జట్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి కప్పు కొట్టే సత్తా ఏ జట్టుకు ఉందో స్పష్టం చేస్తూ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ స్టేజ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 30 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 60 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు.
ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ 25 బంతుల్లో 39 పరుగులు చేయగా, ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో మూడు సిక్సర్లతో 28 పరుగులు జోడించి స్కోరును బౌండరీ దాటించారు. అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయి తడబడింది. అజింక్య రహానే (63), మనీష్ పాండే (25), రోవ్మన్ పావెల్ (29) మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమవడంతో కేకేఆర్ 163 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి వెళ్తూ వెళ్తూ ఘనమైన ముగింపును ఇచ్చింది.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) అత్యంత ప్రమాదకరమైన జట్టు అని అక్షర్ పటేల్ అభివర్ణించాడు. ఆ జట్టుతో ఆడేటప్పుడు మిగతా జట్లు చాలా అప్రమత్తంగా ఉండాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు.
సన్రైజర్స్ జట్టులో ఉన్న బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిందో ఆయన విశ్లేషించాడు. ముఖ్యంగా టాప్ త్రీ బ్యాటర్లయిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ గనుక క్రీజులో నిలదొక్కుకుని రాణిస్తే, ఆ జట్టును ఆపడం ప్రపంచంలో ఏ బౌలింగ్ విభాగానికైనా సాధ్యం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. వారి బ్యాటింగ్ పవర్ప్లేలోనే మ్యాచ్ను ప్రత్యర్థుల నుంచి లాగేసుకుంటుందని కొనియాడాడు.
కేవలం టాప్ ఆర్డర్ మాత్రమే కాకుండా, ఒకవేళ ఆ ముగ్గురు త్వరగా అవుట్ అయినా సన్రైజర్స్ను తక్కువ అంచనా వేయలేమని అక్షర్ పటేల్ అన్నాడు. మిడిల్ ఆర్డర్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లు ఉన్నారని గుర్తు చేశాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో అసాధ్యమైన మ్యాచ్లను గెలిపించిందని ఆయన ప్రశంసించాడు.
వీటన్నింటికీ మించి పాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి అనుభవజ్ఞుడైన అంతర్జాతీయ ప్లేయర్ కెప్టెన్గా ఉండడం హైదరాబాద్ జట్టుకు కొండంత అండ అని అక్షర్ పేర్కొన్నాడు. కమిన్స్ నాయకత్వ లోపాలేవీ లేకుండా జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతమని, ఈ లీగ్ ముగింపు దశలో హైదరాబాద్ జట్టును ఎదుర్కోవడం మిగతా ప్లేఆఫ్స్ జట్లకు అతిపెద్ద సవాల్ అని ఢిల్లీ కెప్టెన్ తేల్చి చెప్పాడు.
ఐపీఎల్ 2026 టోర్నీ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ వైదొలిగినప్పటికీ, కెప్టెన్గా అక్షర్ పటేల్ ఇచ్చిన ఈ సమీక్ష క్రికెట్ విశ్లేషకులను సైతం ఆలోచింపజేస్తోంది. లీగ్ దశలో సన్రైజర్స్ సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఏ ఆటగాడైనా ఇదే మాట చెబుతాడనడంలో సందేహం లేదు. మరి అక్షర్ పటేల్ ఊహించినట్టే సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లేఆఫ్స్లో చెలరేగి ట్రోఫీని ముద్దాడుతుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..